హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన స్టార్టప్ సెలిస్టీయల్ ఈ–మొబిలిటీ కోటి రూపాయల(2 లక్షల డాలర్ల) నిధులు సేకరించింది. ఈ ఏడాది మేలోనే ప్రారంభమైన ఈ కంపెనీ ఇనీషియల్ ఫండింగ్ కింద ఈ మొత్తాన్ని సేకరించినట్టు వెల్లడించింది. తొలి రౌండ్ ఫండింగ్ సింగపూర్కు చెందిన ఎన్ఆర్ఐ మేక సుధాకర్ రెడ్డి నుంచి వచ్చినట్టు పేర్కొంది. ఈయనకు లాజిస్టిక్స్ స్పేస్లో 18 ఏళ్ల అనుభవముంది. ఈ నిధులతో మార్కెట్లోకి దీర్ఘకాలికమైన బ్యాటరీ లైఫ్తో ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాక్టర్లను లాంచ్ చేయబోతుంది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను అభివృద్ధి చేయడంలో కంపెనీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టు చెప్పింది. ‘రాబోయే నెలలో తొలి వెహికిల్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాం’ అని సెలిస్టీయల్ ఈ–మొబిలిటీ ఫౌండర్, ప్రమోటర్ సిద్ధార్థ దురైరాజన్ చెప్పారు.
ఆ ట్రాక్టర్ ఫీచర్లను కూడా వివరించారు. హార్టికల్చర్, గ్రీన్ హౌస్లకు జీరో ఎమిషన్స్తో ఈ ఎకోలాజికల్ ట్రాక్టర్ను అభివృద్ధి చేస్తున్నామని, ఫ్యాక్టరీల మధ్య గూడ్స్ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి కూడా ఇది ఉపయోగపడనుందని పేర్కొన్నారు. అంతేకాక ఎయిర్పోర్ట్లలో లగేజ్లను తరలించడానికీ ఈ ట్రాక్టర్లను ఉపయోగించవచ్చని చెప్పారు. పలు మేజర్ నగరాలు ట్రాఫిక్తో, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ తెరపైకి వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ స్టార్టప్ ను నెలకొల్పారు.
100 ఈ–మొబిలిటీ హెవీ వెహికిల్స్ను తయారు చేసే సామర్థ్యం సెలిస్టీయల్కు ఉంది. ఇండస్ట్రీ అంచనా ప్రకారం 2030 నాటికి ఇండియాలో అమ్ముడుపోయే 40 శాతం కొత్త వెహికిల్స్ అంటే సుమారు 2.4 కోట్ల వెహికిల్స్ బ్యాటరీతో రూపొందేవే ఉంటాయి. 2016లో అమ్ముడుపోయిన 2.2 కోట్ల వెహికిల్స్ కంటే 2030లో అమ్ముడుపోయే ఎలక్ట్రిక్ వెహికిల్సే ఎక్కువగా ఉంటాయని వాహనరంగ నిపుణుడు ఒకరు చెప్పారు.