సింగరేణిలో ఎన్నికల నగరా..షెడ్యూల్‌‌ జారీ చేసిన డీసీఎల్​సీ

సింగరేణిలో ఎన్నికల నగరా..షెడ్యూల్‌‌ జారీ చేసిన డీసీఎల్​సీ
  • అక్టోబర్​ 6న నామినేషన్లు.. 28న ఎన్నికలు 
  • పలు సంఘాలు చర్చలకు రాకపోవడంపై అనుమానాలు

హైదరాబాద్‌‌/ కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలైంది. అక్టోబర్‌‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు, 28న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు డిప్యూటీ చీఫ్ లేబర్‌‌ కమిషనర్‌‌ డి.శ్రీనివాస్‌‌లు బుధవారం ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేశారు. ఈ ఏడాది మే 22న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. అయితే ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. సింగరేణి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు అక్టోబర్​లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా షెడ్యూల్​ జారీ అయింది.

షెడ్యూల్​ వివరాలు..

తాజా షెడ్యూల్​ ప్రకారం సెప్టెంబర్ 30 వరకు డ్రాఫ్ట్  ఓటర్‌‌ లిస్టు ప్రకటన ఉంటుంది. అక్టోబర్​3న ఓటరు లిస్ట్‌‌పై అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్‌‌ 4న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫైనల్‌‌ ఓటర్‌‌ లిస్టు ప్రదర్శిస్తారు. అక్టోబర్​ 6, 7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు  నామినేషన్ల విత్‌‌డ్రా

10న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్క్రూటినీ, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల గుర్తుల కేటాయింపు ఉంటుంది. అక్టోబర్ 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్‌‌ ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

నాటకీయ పరిణామాల మధ్య చర్చలు..

కేంద్ర కార్మిక శాఖ కార్యాలయంలో బుధవారం డీసీఎల్​సీ శ్రీనివాస్​ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం ఏఐటీయూసీ ​తరఫున వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్​కుమార్, ఎండీ అక్బర్, బీఎంఎస్​తరఫున యాదగిరి సత్తయ్య చర్చలకు హాజరయ్యారు. 27న జరిగే చర్చల్లో పాల్గొంటామని ఈ నెల 22న సింగరేణి యాజమాన్యం, 14 కార్మిక సంఘాలు ముందే సంతకాలు చేశాయి. చర్చలకు ఏఐటీయూసీ, బీఎంఎస్​ సంఘాల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. సింగరేణి యాజమాన్యం తరఫున ప్రతినిధులు పాల్గొంటారని భావించినా రాలేదు.

చివరకు కోర్టు తీర్పుతో సాయంత్రం 6 గంటలకు డీసీఎల్​సీ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్​ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్, మినిట్స్ కాపీ సమాచారం, అవసరమైన చర్యల కోసం మేనేజ్‌‌మెంట్‌‌తో పాటు అన్ని యూనియన్ల(గైర్హాజరైన, వాయిదా కోరిన వారికి)కు ఫార్వార్డ్ చేస్తామన్నారు. 

హాజరు కాని సంఘాలు

ఏఐటీయూసీ, బీఎంఎస్​ మినహా 12 కార్మిక సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్యం ప్రతినిధుల చర్చలకు హాజరుకాలేదు. కాగా పలు డిమాండ్లతో కూడిన లెటర్​ను మొయిల్​ ద్వారా11 కార్మిక సంఘాలు(టీబీజీకేఎస్ లేకుండా)డీసీఎల్​సీకి పంపించారు. అనంతరం నేరుగా సింగరేణి భవన్​కు చేరుకొని సింగరేణి డైరెక్టర్ బలరాంనాయక్​తో సమావేశమయ్యారు. అయితే మోజార్టీ కార్మిక సంఘాలు చర్చల్లో పాల్గొనకపోవడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర సర్కారు​ఎన్నికల పట్ల ఆసక్తి చూపకపోవడంతో  సింగరేణి యాజమాన్యం వ్యూహత్మకంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్దామని, మోజార్టీ కార్మిక సంఘాలను డీసీఎల్​సీ చర్చలకు హాజరుకాకుండా అడ్డుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి సహకారంతో ఎన్నికల వాయిదాకు యాజమాన్యం మరోసారి కోర్టును ఆశ్రయించే ఛాన్స్​ ఉందని ప్రచారం జరుగుతోంది.