
- అక్టోబర్ 6న నామినేషన్లు.. 28న ఎన్నికలు
- పలు సంఘాలు చర్చలకు రాకపోవడంపై అనుమానాలు
హైదరాబాద్/ కోల్బెల్ట్, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు, 28న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాస్లు బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఏడాది మే 22న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. సింగరేణి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు అక్టోబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా షెడ్యూల్ జారీ అయింది.
షెడ్యూల్ వివరాలు..
తాజా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30 వరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటన ఉంటుంది. అక్టోబర్3న ఓటరు లిస్ట్పై అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 4న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫైనల్ ఓటర్ లిస్టు ప్రదర్శిస్తారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల విత్డ్రా
10న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్క్రూటినీ, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల గుర్తుల కేటాయింపు ఉంటుంది. అక్టోబర్ 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
నాటకీయ పరిణామాల మధ్య చర్చలు..
కేంద్ర కార్మిక శాఖ కార్యాలయంలో బుధవారం డీసీఎల్సీ శ్రీనివాస్ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం ఏఐటీయూసీ తరఫున వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్కుమార్, ఎండీ అక్బర్, బీఎంఎస్తరఫున యాదగిరి సత్తయ్య చర్చలకు హాజరయ్యారు. 27న జరిగే చర్చల్లో పాల్గొంటామని ఈ నెల 22న సింగరేణి యాజమాన్యం, 14 కార్మిక సంఘాలు ముందే సంతకాలు చేశాయి. చర్చలకు ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. సింగరేణి యాజమాన్యం తరఫున ప్రతినిధులు పాల్గొంటారని భావించినా రాలేదు.
చివరకు కోర్టు తీర్పుతో సాయంత్రం 6 గంటలకు డీసీఎల్సీ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్, మినిట్స్ కాపీ సమాచారం, అవసరమైన చర్యల కోసం మేనేజ్మెంట్తో పాటు అన్ని యూనియన్ల(గైర్హాజరైన, వాయిదా కోరిన వారికి)కు ఫార్వార్డ్ చేస్తామన్నారు.
హాజరు కాని సంఘాలు
ఏఐటీయూసీ, బీఎంఎస్ మినహా 12 కార్మిక సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్యం ప్రతినిధుల చర్చలకు హాజరుకాలేదు. కాగా పలు డిమాండ్లతో కూడిన లెటర్ను మొయిల్ ద్వారా11 కార్మిక సంఘాలు(టీబీజీకేఎస్ లేకుండా)డీసీఎల్సీకి పంపించారు. అనంతరం నేరుగా సింగరేణి భవన్కు చేరుకొని సింగరేణి డైరెక్టర్ బలరాంనాయక్తో సమావేశమయ్యారు. అయితే మోజార్టీ కార్మిక సంఘాలు చర్చల్లో పాల్గొనకపోవడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర సర్కారుఎన్నికల పట్ల ఆసక్తి చూపకపోవడంతో సింగరేణి యాజమాన్యం వ్యూహత్మకంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్దామని, మోజార్టీ కార్మిక సంఘాలను డీసీఎల్సీ చర్చలకు హాజరుకాకుండా అడ్డుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి సహకారంతో ఎన్నికల వాయిదాకు యాజమాన్యం మరోసారి కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.