
- ట్రాఫిక్ పెండింగ్ చలాన్ ఆఫర్కు విశేష స్పందన
హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ డిస్కౌంట్ ఆఫర్కు వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 26న ఈ ఆఫర్ అమల్లోకి రాగా., మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా రూ.8.44 కోట్ల ఆదాయం సమకూరినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్లు..సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా 80 లక్షలు వసూలు అయ్యాయి.
ఇక రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు గాను 76.79 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. అయితే రాయితీ ఆఫర్ను పొందేందుకు వాహనదారులు భారీగా చెల్లింపులు చేయడంతో ట్రాఫిక్ చలాన్ సర్వర్ డౌన్ అవుతోంది. తరచూ సర్వర్ మొరాయిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇక చలాన్లు కట్టేందుకు మీ సేవ కేంద్రాల వద్ద వాహనదారులు బారులు తీరారు.