వాహనాలతో నిండిపోతున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు

వాహనాలతో నిండిపోతున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు

సైబరాబాద్​కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లు వాహనాలతో నిండిపోతున్నాయి. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను తిరిగి తీసుకువెళ్లేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో రోజుకు పదుల సంఖ్యలో  పోలీస్ స్టేషన్​కు వాహనాలు వస్తుండడంతో  స్థలం లేక వాటిని రోడ్డుపైనే పెట్టాల్సి వస్తోంది.  ఫలితంగా వాహనాలకు భద్రత కరువైంది.

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో  గచ్చిబౌలి, మియాపూర్, కూకట్​పల్లి, మాదాపూర్, బాలానగర్​ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లు ఉన్నాయి. ఇవన్నీ పట్టుబడ్డ వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్​ పోలీసులు తమ పోలీస్​ స్టేషన్​ పరిధిలో  ప్రతి రోజు ఏదో ఒక చోట తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ తనిఖీల్లో డ్రంక్​ అండ్​ డ్రైవ్, సెల్​ డ్రైవింగ్, హెల్మెట్​ లేకుండా,  ఇయర్​ ఫోన్స్​ పెట్టుకొని,  లైసెన్స్​ లేకుండా నడుపుతూ పట్టుబడ్డ వారికి ట్రాఫిక్​ పోలీసులు చలాన్లు విధించి వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్​ స్టేషన్​కు తరలిస్తుంటారు.

తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్​…

డ్రంక్​ అండ్​ డ్రైవ్, డ్రైవింగ్​ లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం, సెల్​ ఫోన్​ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ట్రాఫిక్​ పోలీసులు అక్కడే చలాన్లు విధించి వాహనాలను స్వాధీనం చేసుకొని సంబంధింత పోలీస్​ స్టేషన్​కు తరలిస్తారు. మరుసటి రోజు పట్టుబడిన వాహనదారులకు తమ తల్లిదండ్రులతో, లేక భార్య, భర్తతో కలిసి మాదాపూర్​ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో నిర్వహించే కౌన్సిలింగ్​కు హాజరు కావాల్సిందిగా పేర్కొంటారు. కౌన్సిలింగ్​కు హాజరైన వారికి ట్రాఫిక్​ ఎస్​ఐ సమక్షంలో ట్రాఫిక్​ నియమాలపై, ప్రమాదాలపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కోర్టుకు హాజరై కోర్టు విధించిన ఫైన్​ కట్టి, శిక్షను అనుభవించిన తర్వాతే ట్రాఫిక్​ పోలీసులు వారి  వాహనాలను అప్పగిస్తారు.

కౌన్సిలింగ్​కు వస్తలేరు.. వాహనాలను తీసుకు పోతలేరు..

పోలీసుల  కౌన్సిలింగ్​కు చాలా మంది వాహనదారులు హాజరు కావడం లేదు. దీనికి కారణం ట్రాఫిక్​ పోలీసులకు పట్టుబడడం ఇంట్లో తెలిస్తే ఏం అవుతుందోననే భయం,  కౌన్సిలింగ్​కు హాజరై కోర్టులో జైలు శిక్ష పడితే తమ పరువు పోతుందనే భయం, కోర్టులో జైలు శిక్ష విధిస్తారనే భయం వాహనదారుల్లో నెలకొంది. అందుకే చాలా మంది తన వాహనాలను తీసుకువెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారని ట్రాఫిక్​ పోలీసులు పేర్కొంటున్నారు.  దీని వలన ప్రతి రోజు పదుల సంఖ్యలో వాహనాలు పోలీస్​ స్టేషన్​కు వస్తుండడంతో  వాహనాలను నిలిపేందుకు స్థలం సరిపోవడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.

స్పందన అంతంతే...

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని అన్ని ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ల ఆధ్వర్యంలో  కోర్టు అధికారుల సమక్షంలో లోక్​ అదాలత్​ నిర్వహిస్తున్నారు. దీనికీ  స్పందన మాత్రం అంతంతే ఉంది. గత నెల 27న నిర్వహించిన లోక్​ అదాలత్​లో 29 కేసులను పరిష్కరించారు. దీనిలో  జైలు శిక్ష విధించకుండా అన్ని  ట్రాఫిక్​ పీఎస్​ల నుండి  రూ.10,52,500 ఫైన్లు వసూలు చేసి వాహనాలను అప్పగించారు.
డ్రంక్​ అండ్​ డ్రైవ్​కు రూ.2000,  సెల్ ఫోన్ డ్రైవింగ్​కు రూ.1000, డ్రైవింగ్​ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన వారికి రూ.500 చొప్పున ఫైన్​లు వసూలు చేశారు. దీనికి కూడా వాహనదారుల నుండి  స్పందన రావడం లేదని తెలుస్తోంది.