రైళ్లు ఆగుతలేవు.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

రైళ్లు ఆగుతలేవు.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  •     తొమ్మిదేళ్లుగా రైల్వే స్టేషన్లలో కొత్త హాల్టింగ్​లు లేవు
  •     కొన్ని చోట్ల రెండింటితో సర్దుకోవాలె
  •     రైళ్లకు హాల్టింగ్​లు ఇప్పించలేని ఎంపీలు
  •     విజ్ఞప్తులను పట్టించుకొని రైల్వేశాఖ
  •     మంచిర్యాల జిల్లాలో హల్టింగ్ ఇవ్వాలని స్థానికుల వేడుకోలు

కోల్​బెల్ట్, వెలుగు: ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే కీలకమైన రైల్వే మార్గం ఉన్న మంచిర్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపడం లేదు.  ఏళ్లుగా పలు ఎక్స్​ప్రెస్ రైళ్ల హాల్టింగ్​ కోసం స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు. పారిశ్రామికంగా, వ్యాపారంగా ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్​ లాంటి  పట్టణాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రధాన రైళ్లు ఆగకుండా పోతున్నాయి. తొమ్మిదేళ్ల కాలంలో కనీసం ఒక్క ట్రైన్​కు కొత్తగా హాల్టింగ్​ కల్పించలేదు.  ఆదాయం వచ్చే  రైల్వే స్టేషన్లలో  కూడా ప్రయాణికులకు  కనీస సౌలత్​లను రైల్వే శాఖ కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల పలు రైళ్లకు హాల్టింగ్​లు కల్పించాలని స్థానికులు ఆందోళనలు చేసినా  రైల్వే ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. 

తొమ్మిదేళ్లలో కొత్త హాల్టింగ్​లు లేవు

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్ల నుంచి రైల్వే శాఖ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని(రామకృష్ణాపూర్​), రేచినీరోడ్​(తాండూర్​) రైల్వే స్టేషన్ల  మీదుగా స్థానికులు దేశంలోని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వేలను ప్రధాన ప్రయాణ సాధనంగా ఉపయోగిస్తుంటారు. పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన వివేక్​ వెంకటస్వామి హయంలోనే మాత్రమే  కొత్త రైళ్లు, పలు రైళ్లకు హాల్టింగ్​లు కల్పించారు. తర్వాత  ఐదేళ్లపాటు పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన బాల్క సుమన్​  ఆరు ఎక్స్​ప్రెస్​ రైళ్లను ప్రవేశపెడితే జిల్లా స్టేషన్లలో ఒక్కదానికి కూడా హాల్టింగ్​ కల్పించలేకపోయారు. ప్రస్తుత ఎంపీ బొర్లకుంట వెంకటేశ్​నేత సైతం ఇప్పటి వరకు కొత్తగా ​ ఒక్క హాల్టింగ్​ కూడా ఇప్పించలేకపోయారు.  

రాజధానికి వెళ్లడమంటే నరకమే

జిల్లా ప్రజలకు సరిపడ రైళ్లు లేకపోవడంతో నరకయాతన మధ్య ప్రయాణాలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని  రైల్వే స్టేషన్​పై ఆధారపడాల్సిందే.  ఇక్కడ  మిగిలిన స్టేషన్ల కంటే  రెండు మూడు ఎక్స్​ప్రెస్​ రైళ్లకు హాల్టింగ్​ కలిగి ఉండటమే కారణం.  సామాన్య ప్రజలు ఉదయం హైదరాబాద్​కు వెళ్లడానికి ఏకైక రైలు  భాగ్యనగర్​  ఎక్స్​ప్రెస్​  మాత్రమే.   గతంలో సిర్పూర్​ కాగజ్​నగర్​ వరకు ఉన్నప్పుడు జిల్లా వాసులు సులభంగా హైదరాబాద్​కు వెళ్లేవారు.  ఆ రైలును మహారాష్ట్ర మన్మాడ్​ వరకు పొడిగించడంతో జిల్లా వాసులు కనీసం కాలు పెట్టడానికి కూడా జాగ ఉండదు.  ఇందులో ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ రైలు మిస్సయితే మళ్లీ మధ్యాహ్నం వరకు ఒక్క  రైలు అందుబాటులో లేదు. రాష్ట్ర రాజధాని నుంచి తిరుగు ప్రయాణంలో  సాయంత్రం 3 గంటలకు భాగ్యనగర్​ ఎక్స్​ప్రెస్​ మిస్సైతే ఇక రావడం మరుసటి రోజే. 

రెండు రైళ్లతోనే సర్దుకోవాల్సిందే..

కరోనా లాక్​డౌన్​ సడలింపు తర్వాత ఇంతకు ముందున్న ప్యాసింజర్​ రైళ్లను ఎక్స్​ప్రెస్​లుగా మార్చిన రైల్వే శాఖ హాల్టింగ్ పాయింట్లను తగ్గించింది. కాజీపేట జంక్షన్​ నుంచి మంచిర్యాల మీదు సిర్పూర్​కు రాకపోకలు సాగించే రామగిరి, సింగరేణి, అజ్నీ ప్యాసింజర్లను(బల్లర్షా- కాజీపేట) ఎక్స్​ప్రెస్​లు మార్చారు. అయితే వీటిని సింగరేణి కార్మిక కుటుంబాలు అత్యధికంగా ఉండే మందమర్రి, రేచీని రోడ్​ రైల్వే స్టేషన్లలో ఆపడం లేదు. కేవలం భాగ్యనగర్​, ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​ రైళ్లకు మాత్రమే హాల్టింగ్​ కల్పించారు. కరీంనగర్​ ఫుష్​ పుల్​ రైలు అంతంత మాత్రమే సేవలు అందిస్తోంది. సింగరేణి కంపెనీ మొయిన్​ ఆఫీస్​ కొత్తగూడెంలో ఉండటంతో కార్మికులు తప్పనిసరిగా సింగరేణి ఎక్స్​ప్రెస్​(భద్రాచలం- సిర్పూర్​)పై 
ఆధారపడుతుంటారు. 

ఆదాయం వస్తున్న ఆపుతలేరు..

కాజీపేట- బల్లర్షా రైల్వే మార్గంలో అత్యంత ఆదాయాన్ని ఇచ్చేది మంచిర్యాల రైల్వే స్టేషన్. కానీ  దూరప్రాంతాలకు వెళ్లే సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లు ఆగడం లేదు. ఇక్కడ రోజుకు ప్రయాణికుల నుంచి రూ.5 లక్షల ఆదాయం వస్తుండగా జిల్లాలోని మిగిలిన బెల్లంపల్లి, రవీంద్రఖని(రామకృష్ణాపూర్​), మందమర్రి, రేచిన్​రోడ్డు స్టేషన్ల నుంచి మరో రూ.5లక్షలకు పైగా ఆదాయాన్ని రైల్వేశాఖ అర్జిస్తోంది. మంచిర్యాలలో ఏపీ ఎక్స్​ప్రెస్​, కేరళ్, హంసఫర్​, పూరి-కాజీపేట, బికనేర్​, సంఘమిత్ర రైళ్ల హాల్టింగ్​కు ప్రయాణికులు డిమాండ్​ చేస్తున్నారు. రవీంద్రఖనిలో కాజీపేట- బల్లర్షా ఎక్స్​ప్రెస్(అజ్నీ)​, దక్షిణ్​, జీటీ, జనతా, హైదరాబాద్​- నాగ్​పూర్​ ఎక్స్​ప్రెస్​లకు, మందమర్రిలో సింగరేణి, రామగిరి, కాజీపేట- బల్లర్షా ఎక్స్​ప్రెస్​, దక్షిణ్​, జనతా ఎక్స్​ప్రెస్, బెల్లంపల్లిలో జీటీ, నవజీవన్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లకు, రేచిన్​లో సింగరేణి, రామగిరి, కాజీపేట- బల్లర్షా ఎక్స్​ప్రెస్​ రైళ్లకు హాల్టింగ్​ కల్పించాలని స్థానికులు ఎంపీలు, మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించారు. ఇటీవల మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్​ వెంకటస్వామిని కలిసిన జిల్లా వాసులు, బీజేపీ లీడర్లు రైళ్ల హాల్టింగ్​కు చొరవచూపాలని విజ్ఞప్తి చేశారు.