జూబ్లీహిల్స్, వెలుగు: తమ లీడర్ మోనాలిసా వేధింపులు భరించలేక ఈ నెల 17న బోరబండలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ట్రాన్స్ జెండర్లలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా.. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న నవనీత(24) మంగళవారం మృతిచెందారు. ఆమె డెడ్బాడీని స్వస్థలమైన కర్నాటకకు తరలించారు. పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లడంతో అప్రమత్తమైన బోరబండ ఎస్సై కాశన్న, పోలీస్ సిబ్బంది కర్నాటకకు వెళ్లారు.
జైలులో ఉన్నా బెదిరింపులు ఆగట్లే..
ట్రాన్స్జెండర్ల లీడర్గా కొనసాగుతున్న మోనాలిసా పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినా వేధింపులు తమపై వేధింపులు ఆగడం లేదని బాధిత ట్రాన్స్ జెండర్ లు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాట్లాడారు.
కిడ్నాప్లు, దొంగతనం, హత్యాయత్నం, దారి దోపిడి వంటి కేసుల్లో మోనాలిసా జైలుకు వెళ్లారని చెప్పారు. ఆమె అక్కడి నుంచే తన అనుచరుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరు రోజుకు రూ.1500 ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు.
