అక్కడే చిక్కుకుపోయిన 34 చమురు రవాణా నౌకలు
తొందరగా క్లియర్ చేయకపోతే సమస్యేనని దేశాల ఆందోళన
కైరో:ఒక్క షిప్పు.. ఆ ఒక్క పెద్ద షిప్పు ప్రపంచంలోని నౌకా రవాణా వ్యవస్థను ఆపేసింది. మంగళవారం సూయజ్ కాల్వలో అడ్డంగా చిక్కుకుని.. అటూ ఇటూ నౌకలను జామ్ చేసింది. ముందుకు పోనివ్వకుండా.. వెనక్కు వెళ్లలేకుండా చేసింది. దాదాపు 150 సరుకు రవాణా నౌకలు అక్కడే ఆగి పోయాయి. గురువారం కూడా అదే పరిస్థితి ఉంది. టగ్ బోట్లు, డిగ్గర్లతో దానిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. 400 మీటర్ల పొడవున్న ‘ఎవర్ గ్రీన్’ అనే నౌక చైనా నుంచి నెదర్లాండ్స్లోని రోటర్ డ్యామ్కు వెళుతుండగా బలమైన గాలులకు అడ్డం తిరిగింది. సరుకులతో ఫుల్లుగా ఉన్న ఆ షిప్పు 2 లక్షల టన్నుల బరువుంటుంది. దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని ఉత్తరాన ఉన్న మధ్యదరా సముద్రంతో ఈ సూయజ్ కాలువే కలుపుతుంది.
3.79 లక్షల చమురు కంటెయినర్లు అక్కడే..
ఇప్పుడు ఎవర్ గ్రీన్ ఇరుక్కుపోవడంతో యూరప్ దేశాలు, ఉత్తర అమెరికా దేశాలకు 3లక్షల79వేల కంటెయినర్ల ముడి చమురును తరలిస్తున్న 34 నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. దీంతో చాలా మంది వ్యాపారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియాలో చమురు వెలికి తీత తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సూయజ్లో వీలైనంత తొందరగా ట్రాఫిక్ను క్లియర్ చేయకపోతే ధరలు మరింత పెరిగే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్, యూరప్ దేశాలకు సరుకు రవాణాపై ప్రభావం పడడంతో చాలా వ్యాపారాలపై దెబ్బ పడుతుందని చెబుతున్నారు. ఇక, షిప్ అడ్డం తిరిగినప్పుడు ఎక్కువగా ఉన్న గాలివేగం ఆ తర్వాత తగ్గడంతో నౌకను పక్కకు తీసే ప్రయత్నాల్లో ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా, షిప్ అడ్డం తిరిగినందుకు ఆ షిప్ యజమాని షూయి కిసెన్ క్షమాపణలు చెప్పారు.