మరో రెండు వారాలు..కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు 

మరో రెండు వారాలు..కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు 
  • మే 7న హాజరుపరచాలని ఆదేశం 
  • రెండు నెలల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తం: ఈడీ 

న్యూఢిల్లీ, వెలుగు : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఆమెను తిరిగి మే 7న కోర్టు ముందు హాజరుపరచాలని అధికారులను ఆదేశించింది. గతంలో కవితకు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించాలని సీబీఐ, ఈడీ అప్లికేషన్ దాఖలు చేశాయి. ఈ అప్లికేషన్ పై కవిత తరఫు న్యాయవాదులు నితీశ్ రాణా, మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో కొత్త అంశాలేవీ లేవని, అందువల్ల కస్టడీని పొడిగించాల్సిన అవసరం లేదని వాదించారు. ఈడీ తరఫున అడ్వొకేట్ జోహెబ్ హుస్సేన్ వాదిస్తూ.. కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుందని, అందువల్ల కస్టడీని పొడిగించాలని కోరారు.

దీంతో పాటు కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు సమర్పించారు. కవిత పాత్రపై రెండు నెలల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. అయితే సాక్ష్యాలను కవిత తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థలు మొదటి రోజు నుంచి ఆరోపిస్తున్నాయని, అంతకుమించి కొత్తగా ఏమీ చెప్పడం లేదని లాయర్ నితీశ్ రాణా అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు.