
వెలుగు నెట్వర్క్ : ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఆదివాసీ జెండాను ఎగురవేసి, డోలు, తుడుం వాయిద్యాల నడుమ సంప్రదాయ పూజలు, గుస్సాడీ నృత్యాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆధికారులు, రాజకీయ నాయకులు.. కుమ్రంభీం, బిర్సాముండా, హైమన్ డార్ఫ్ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ‘ఆదివాసీ హక్కులను కాపాడుదాం - అస్తిత్వాన్ని రక్షిద్దాం’ అని నినదిస్తూ పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు, ఆదివాసీ సంఘాల నాయకులు కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కోవ లక్ష్మి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీలు అఖిల్ మహాజన్, కాంతిలాల్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు.