- ఓటేసేందుకు బయటకు రావొద్దంటూ బెదిరింపులు
కోల్కతా: బీజేపీకి ఓటెయ్యొద్దంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. బీజేపీ కార్యకర్తలెవరైనా బయటకు వచ్చి ఓటేస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే నెల 12న పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలోనే ఆ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన పాండవేశ్వర్ ఎమ్మెల్యే నరేన్ చక్రవర్తి కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ సందర్భంగా బీజేపీకి హార్డ్కోర్ అభిమానులపై ఓ కన్నేసి ఉంచాలని, అవసరమైతే బెదిరించాలని సూచించారు. ‘‘పోలింగ్ రోజు బయటకు రావొద్దని వాళ్లకు చెప్పండి. ఓటేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించండి. పోలింగ్ రోజు బయటకొస్తే.. బీజేపీకే ఓటేసినట్టు అనుకుంటామని వారికి చెప్పండి. ఇంట్లోనే ఉంటే మాకు మద్దతిచ్చినట్టు అనుకుంటామని వివరించండి. పోలింగ్ నాడు బయటకు రాకుండా ఉంటే అన్ని విషయాల్లో సాయం చేస్తామనండి’’ అంటూ ఆయన టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.
బీజేపీ నేతల మండిపాటు
తృణమూల్ పార్టీ తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. వీడియోను జతచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నరేన్ చక్రవర్తి వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ.. ఇలాంటి నేరస్థులను మమత బెనర్జీ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. నరేన్ చక్రవర్తికి ముందునుంచే నేర చరిత్ర ఉందని బీజేపీ బెంగాల్ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. బహిరంగంగా బెదిరింపులకు దిగిన నరేన్పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కాగా, ఎంపీ బాబూల్ సుప్రియో.. బీజేపీని వీడి టీఎంసీలో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది.