
కర్ణాటకలో 23 ఏళ్ల త్రివేణి అనే యవతి బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్గా ఎన్నికైంది. దీంతో ఆ రాష్ట్రంలోని అత్యంత పిన్న వయస్కురాలు అయిన మేయర్గా ఆమె నిలిచింది. మార్చి 29న జరిగిన బళ్లారి మేయర్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోల నిలిచిన త్రివేణి విజయం సాధించింది. మొత్తం 44 ఓట్లలో త్రివేణి 28 ఓట్లు దక్కించుకుంది. బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థి నాగరత్నకు 16 ఓట్లు వచ్చాయి. డిప్యూటీ మేయర్గా జానకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మేయర్ పదవికి కాంగ్రెస్ నుంచి ఆరుగురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మేయర్ పదవి రేసులో ఉమాదేవి శివరాజ్, త్రివేణి, కుబేర, మించు శ్రీనివాస్, శ్వేత ఉన్నారు. వారందరినీ అధిగమించి త్రివేణి మేయర్గా అవతరించింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే గతంలో త్రివేణి తల్లి సుశీలా బాయి కూడా మేయర్గా పనిచేశారు. పారా మెడికల్ ఎడ్యుకేషన్ చేసిన త్రివేణి 2022 మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు నుంచి పోటీ చేసి 501 ఓట్లతో గెలుపొందారు. కాగా 2020లో కేరళకి చెందిన ఆర్య రాజేంద్రన్ (21) కూడా మేయర్గా ఎన్నికై వార్తల్లో నిలిచారు.