
ఛత్తీస్గఢ్: దంతెవాడ జిల్లా కట్టెకళ్యాణ్ పోలీసు స్టేషన్ పరిధిలోని జియోకొర్తా-డోగోరిపారా వెళ్ళే అటవీప్రాంతంలో 3 కిలోల ఐఈడీ బాంబులను జవాన్లు గుర్తించి నిర్వీర్యం చేశారు. దాంతో స్థానిక పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. నీలవాయి అటవీప్రాంతంలో శుక్రవారం జవాన్లు ఐదుకిలోల శక్తివంతమైన ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ మరుసటి రోజే శనివారం ఉదయం మరో 3 కిలోల ఐఈడీ బాంబులను ప్రత్యేక బలగాలు గుర్తించాయి. జిల్లాలోని డోగిరిపారా మార్గంలోని తెలంటెటమ్ అటవీప్రాంతంలో కూంబింగ్కు వెళ్ళే జవాన్లపై దాడే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులను అమర్చారు. తాజాగా తెలంటెటమ్ గ్రామం వద్ద అధికారులు పోలీసు క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రారంభం చేయనున్న నేపథ్యంలో ప్రత్యేక బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు బాంబులను గుర్తించి సురక్షితంగా వెలికి తీసి నిర్వీర్యం చేసినట్లు పోలీసులు తెలిపారు.