టీఆర్ఎస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకం : రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకం : రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంతా చారి వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.

లిక్కర్ స్కాం  కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి ఎమ్మెల్సీ కవితను మాత్రం అనుమతి కోరుతున్నారని, ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

గతంలో ఎన్నికల కమిషన్ కు తాను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని చెప్పారు. డిసెంబర్ 6వ తేదీ లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లకుండా పోతుందన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకమని కామెంట్ చేశారు.