తప్పుకుంటరా లేదా?..రెబల్స్ కు టీఆర్ఎస్ బుజ్జగింపులు, హెచ్చరికలు

తప్పుకుంటరా లేదా?..రెబల్స్ కు టీఆర్ఎస్ బుజ్జగింపులు, హెచ్చరికలు
  •     తిరుగుబాటు క్యాండిడేట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో రంగంలోకి కేటీఆర్
  •     పిలిపించుకుని సంప్రదింపులు.. ఎమ్మెల్యేలతో ఒత్తిళ్లు
  •     ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రయోజనం.. భవిష్యత్తులో నామినేటెడ్ ​పదవులు!
  •      వినకుంటే పార్టీ నుంచి బహిష్కరణ.. మళ్లీ రానియ్యబోమని స్పష్టం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ టికెట్‌‌‌‌ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడంపై పార్టీ హైకమాండ్​ దృష్టి పెట్టింది. పోటీ నుంచి తప్పుకుంటే ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రయోజనం కల్పించడంతోపాటు భవిష్యత్‌‌‌‌లో నామినేటెడ్​ పదవులు ఇస్తామని హామీలు ఇస్తోంది. పోటీ నుంచి తప్పుకోకుంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటదని హెచ్చరిస్తోంది. టీఆర్ఎస్​ నుంచి పెద్ద సంఖ్యలో రెబెల్స్​ బరిలో ఉండటంతో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బేగంపేట క్యాంపు ఆఫీసులో మీటింగ్​ పెట్టారు. నామినేషన్లు వేసిన రెబెల్స్‌‌తో సంప్రదింపులు జరిపారని.. పార్టీ క్యాండిడేట్ల గెలుపోటములపై ఎఫెక్ట్​ చూపే వారితో మాట్లాడారని టీఆర్ఎస్​ వర్గాలు వెల్లడించాయి.

కనీసం సగం సీట్లలో..

150 డివిజన్లకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి 527 నామినేషన్లు దాఖలయ్యాయి. చాలా చోట్ల ఆరుగురు నామినేషన్లు వేశారు. కనీసం సగం సీట్లలో రెబెల్స్‌‌‌‌ ప్రభావం ఉండొచ్చని గుర్తించిన టీఆర్ఎస్​ హైకమాండ్.. వారిని బుజ్జగించడానికి పూనుకుంది. ఈ క్రమంలోనే కేటీఆర్‌‌‌‌  తిరుగుబాటు క్యాండిడేట్లతో మాట్లాడారు. కొన్నిచోట్ల తమకు నచ్చని వారికి హైకమాండ్ టికెట్లు ఇచ్చిందన్న ఉద్దేశంతో  కొందరు ఎమ్మెల్యేలు వారి అనుచరులతో నామినేషన్లు వేయించారు. అలాంటివారిని ఆయా ఏరియాల ఎమ్మెల్యేల ముందే కూర్చోబెట్టి.. నామినేషన్లు విత్​డ్రా చేసుకునేలా కేటీఆర్‌‌‌‌ ఒత్తిడి చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నామినేషన్ల ఉప సంహరణకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఆలోగా రెబెల్స్​ తో విత్‌‌‌‌ డ్రా చేయించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌‌‌‌చార్జులను కేటీఆర్​ఆదేశించినట్టు సమాచారం. రెబెల్స్​తో ఎమ్మెల్యేలు, ఇన్‌‌‌‌చార్జులు చర్చలు జరుపుతుండగా.. పార్టీపై ఎక్కువ ఎఫెక్ట్​ చూపించే నేతలను కేటీఆర్‌‌‌‌ వద్దకు పిలిపించారు. పోటీ నుంచి తప్పుకోని వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం.