- ఆర్టీసీ ప్రైవేట్కు!
- అద్దె బస్సులు పెంచుతున్న సర్కార్
- పలు డిపోల మూత.. మరికొన్ని మూసేందుకు నిర్ణయం
- సంస్థలో వివిధ రకాల పనులూ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగింత
- ఇప్పటికే 3,220 అద్దె బస్సులు.. కొత్తగా 954కి టెండర్
- సంస్థలో 45 శాతం దాటనున్న హైర్డ్ బస్సులు
- అమలు కాని ప్రభుత్వ హామీలు.. ఆందోళనలో కార్మికులు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని పూర్తి స్థాయిలోప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అద్దె బస్సులతో ఆర్టీసీని మెల్లమెల్లగా ప్రైవేటు బాట పట్టిస్తోంది. కార్మికుల సమ్మెకు ముందు 10 శాతమున్న అద్దె బస్సుల సంఖ్యను మూడేండ్లలో 45 శాతానికి పెంచింది. ఇప్పుడు కొత్తగా మరో 954 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2019లో కార్మికుల సమ్మె తర్వాత ఆర్టీసీకి ఏటా రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ఆదుకుంటామన్న ప్రభుత్వం.. రూపాయి ఇవ్వకపోగా సంస్థను ప్రైవేటుకు అప్పగించే పనిలో పడింది. కార్మికులకు వీఆర్ఎస్ ప్రకటిస్తూ, డిపోలను మూసివేస్తూ, అద్దె బస్సుల సంఖ్యను పెంచుతూ, కార్గో, బస్ పాస్ కౌంటర్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తూ ప్రైవేటీకరణను వేగవంతం చేసింది. గ్యారేజీలో వాషింగ్, స్వీపింగ్ తో పాటు సెక్యూరిటీ, వర్క్ షాప్, తార్నాక హాస్పిటల్ తదితర ఆర్టీసీ అనుబంధ పనులను అవుట్ సోర్సింగ్ కే అప్పగించింది.క్రమంగా ఆర్టీసీ బ్రాండ్ తప్ప బస్సులు, సంస్థలోని ఇతర విభాగాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
4 వేలు దాటిన అద్దె బస్సులు..
తెలంగాణ ఏర్పడే నాటికి ఆర్టీసీలో మొత్తం 10,334 బస్సులుండగా.. వాటిలో 1,292 అద్దె బస్సులు. 2019లో కార్మికుల సమ్మె తర్వాత అద్దె బస్సులు పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు 3,220 అద్దె బస్సులు ఉన్నాయి. కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్తో అద్దె బస్సుల సంఖ్య 4 ,174కు చేరింది. రూట్లను బట్టి అద్దె బస్సుల ఓనర్లకు ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంది. దీని ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. నిరుడు డిసెం బర్లో 70 అద్దె బస్సులను తీసుకున్న యాజమాన్యం.. ఇటీవల 108 స్లీపర్ బస్సులు, 300 ఎలక్ట్రికల్ బస్సు లు తీసుకుంది. ఇప్పుడు మరో 954 బస్సులను కిరా యికి తీసుకుంటోంది.
ఈ నెల 22న టెండర్లు..
కొత్తగా 11 రీజియన్లలో 954 అద్దె బస్సులకు రూట్లు సహా పూర్తి వివరాలతో ఆర్టీసీ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో మహబూబ్నగర్ 98, మెదక్ 48, నల్గొండ 49, రంగారెడ్డి 76, ఆదిలాబాద్ 89, ఖమ్మం 27, కరీంనగర్ 14, నిజామాబాద్ 53, వరంగల్ 30, హైదరాబాద్ సిటీ 251, సికింద్రాబాద్ సిటీ 225 ఉన్నాయి. అద్దె బస్సులు నడిపేందుకు అప్లై చేసుకునేటోళ్లు 18 శాతం జీఎస్టీతో కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2,500 (నాన్ రిఫండబుల్), కాషన్ డిపాజిట్ రూ.60వేలు (రిఫండబుల్) చెల్లించి డీడీ లు తీయాల్సి ఉంటుందని ఆర్టీసీ నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక్క రూట్లో ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనుంది. అద్దె బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అర్హులు కాదని.. బస్సుల టెండర్లను ఎప్పుడైనా రద్దు చేసే హక్కు సంస్థకు ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపింది. అద్దె బస్సుల టెండర్లను ఈ నెల 22న నిర్వహించనుంది.
ఎనిమిదేండ్లలో కొన్నవి 1,826 బస్సులే
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా 1,826 బస్సులే ఆర్టీసీ కొనుగోలు చేసింది. పాత బస్సులను స్క్రాప్ కింద అమ్మేయగా వచ్చిన డబ్బులతో ఎక్కువగా కొత్త బస్సులు కొన్నది. ఇక ఇప్పుడున్న బస్సుల్లో సగం బస్సులను మార్చాల్సి ఉంది. ఏటా వందలాది బస్సులను కాలం చెల్లిదంటూ స్క్రాప్ కింద తొలగిస్తున్నా కొత్తవి మాత్రం కొనడం లేదు. దీంతో సంస్థలో రోజురోజుకు బస్సులు తగ్గిపోయి.. ఎక్సెస్ స్టాఫ్ అవుతోంది.
హామీలేవీ అమలు కాలే...
ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికే 2పేస్కేళ్లు, 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల పేరెంట్స్కు హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా అమలు కావడం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. టెంపరరీ ఎంప్లాయీస్ను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఒక్కరినీ చేయలేదు. పైగా వంద మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఉద్యోగుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అతీగతి లేదు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ పట్టించుకోలేదు. ఎంప్లాయీస్ పీఎఫ్, సీసీఎస్ బకాయిలను మొదట్లో కొద్దిమేర చెల్లించినా ఇప్పుడు బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. సీసీఎస్ మూతబడే పరిస్థితి దాపురించింది.
13 డిపోల మూసివేతకు ప్లాన్!
ఆర్టీసీ యాజమాన్యం ఒక్కొక్కటిగా డిపోలనూ మూసే స్తోంది. నిరుడు పికెట్, హైదరాబాద్ – 3 డిపోలను మూసివేసిన యాజమాన్యం.. రాణిగంజ్ 1, 2లో ఒక డిపోను, అలాగే ముషీరాబాద్ 1, 2 డిపోల్లో ఒక డిపో ను మూసివేయాలని నిర్ణయించింది. వీటిలో సుమారు 141 బస్సులను సిటీలోని ఇతర డిపోలకు తరలించాలని నిర్ణయించారు. స్టాఫ్ను ఇతర డిపోలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ సిటీలో ఉన్న 29 డిపోల్లో దాదాపు 13 డిపోలను మూసివేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోకొన్ని డిపోలను కూడా క్లోజ్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మూసేసిన డిపోల పరిధిలోని స్థలాలు, బిల్డింగ్లను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
ఒక్క హామీ నెరవేర్చలే
‘‘ఆర్టీసీని చావనివ్వం. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. సంస్థలో చీటికిమాటికి సస్పెండ్ చేసే ప్రసక్తే ఉండదు. వారం రోజుల్లో ఉద్యోగ భద్రత గైడ్లైన్స్ తయారు చేయండి. ఇంక్రిమెంట్లు ఆగవు. ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇస్తం. పీఎఫ్, సీసీఎస్ బకాయిలు చెల్లిస్తం’’... 2019 డిసెంబర్ ఒకటిన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలివీ. కానీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు.
పూర్తిగా ప్రైవేట్కు అప్పజెప్పే కుట్ర
వివిధ రకాల సేవలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తూ యాజమాన్యం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తోంది. ఓవైపు ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటిస్తూ, అద్దె బస్సులు తీసుకుంటూ, వివిధ విభాగాలను అవుట్ సోర్సింగ్ కు అప్పగిస్తోంది. మొత్తం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తోంది. దీనిపై పార్టీలు, యూనియన్లు, ప్రజా సంఘాలు స్పందించాలి.
- కె.రాజిరెడ్డి, చైర్మన్, ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ ఆస్తులపై సర్కార్ కన్ను..
ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా మూసి వేసేందుకే అద్దె బస్సులను పెంచు తోంది. ఆర్టీసీకి రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోలక్షన్నర కోట్ల విలువైన జాగాలున్నాయి. వీటిపై కన్నే సిన ప్రభుత్వం.. ఇతర అవసరాలకు వాడేందుకు ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోం ది. పేద, మధ్య తరగతి ప్రజలకు రవాణా వ్యవస్థను దూరం చేసే కుట్ర చేస్తోంది.
- హనుమంతు ముదిరాజ్, టీజేఎంయూ, జనరల్ సెక్రటరీ
ప్రభుత్వమే బస్సులు కొనాలె
ప్రభుత్వం కొత్త బస్సులు కొనాలి. అద్దె బస్సులకు టెండర్లు పిలవడం సరికాదు. ఇప్పటికే కొన్ని డిపోల్లో 70 శాతం అద్దె బస్సులే ఉన్నాయి. ఇంకా అద్దె బస్సులు తీసుకొస్తే ఆర్టీసీ కాస్తా.. అద్దె బస్సుల ఆర్టీసీ అవుతుంది. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని కాపాడుకునేందుకు ప్రజలు, నాయకులు ముందుకురావాలి.
-
వీఎస్ రావు, జనరల్ సెక్రటరీ, ఆర్టీసీ ఎస్ డబ్ల్యూఎఫ్
నిధులు ఇస్తలేరు..
ఆర్టీసీలో రెండేండ్ల పాటు యూనియన్లు ఉండవని చెప్పారు. వాటి స్థానంలో ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డులను తీసుకొచ్చారు. ఒకట్రెండు నెలలు హడావుడి చేశారు. ఇప్పుడు సంస్థలో వెల్ఫేర్ బోర్డులు పనిచేయడం లేదు. ఏటా బడ్జెట్లో వెయ్యి కోట్లు పెడుతామన్నారు. బడ్జెట్ లో కేటాయించారు. కానీ విడుదల చేయలేదు.