- ప్రేక్షక పాత్ర వహించిన కాంగ్రెస్
- ఎయిర్పోర్టులో సిన్హాకు కేసీఆర్ స్వాగతం
- జలవిహార్ వరకు భారీ బైక్ ర్యాలీ
- పరిచయ కార్యక్రమం తర్వాత ప్రగతిభవన్లో యశ్వంత్, సీఎం లంచ్
- ఎంఐఎం నేతల వద్దకు తీసుకెళ్లిన టీఆర్ఎస్ లీడర్లు
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దిగిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్ను టీఆర్ఎస్ హైజాక్ చేసింది. సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్ మాత్రం ప్రేక్షక పాత వహించింది. శనివారం ఉదయం రాష్ట్రానికి వచ్చిన యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ దగ్గరుండి చూసుకుంది. అంతా తామై కార్యక్రమాన్ని నడిపించింది. సీఎం కేసీఆర్ స్వయంగా బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సభాస్థలి అయిన జలవిహార్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో తమ పార్టీ మాత్రమే యశ్వంత్కు మద్దతు పలుకుతున్నట్లుగా టీఆర్ఎస్ కార్యక్రమాన్ని నడిపించింది. పరిచయ కార్యక్రమం ముగిశాక సీఎం కేసీఆర్, యశ్వంత్ సిన్హాను ప్రగతి భవన్కు తీసుకెళ్లారు. ఇద్దరు అక్కడే లంచ్ చేశారు. తర్వాత ఎంఐఎం నేతలతో ఒక హోటల్లో జరిగిన భేటీకి యశ్వంత్ను టీఆర్ఎస్ నేతలే దగ్గరుండి తీసుకెళ్లారు. ఈ భేటీ తర్వాత యశ్వంత్ బేగంపేట నుంచి బెంగుళూరు వెళ్లిపోయారు. ఈ మొత్తం విజిట్లో కాంగ్రెస్ పూర్తిగా దూరంగా ఉండిపోయింది.
గాంధీభవన్ విజిట్ ఉన్నా..!
నిజానికి యశ్వంత్ షెడ్యూల్లో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ విజిట్ కూడా ఉంది. కానీ రెండు రోజులకు ముందే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలను ముందు కలిసి తర్వాత తమ వద్దకు వస్తామంటే ఆయనతో భేటీ అయ్యే సమస్యే లేదని తేల్చి చెప్పారు. యశ్వంత్ రాగానే కేసీఆర్ను కలుస్తారనే సమాచారంతో రేవంత్.. ‘ఆ ఇంటి మీది కాకి ఇక్కడ వాలేదే లేదు” అని అన్నారు. ముందు తమ వద్దకు వస్తే కలిసే ఆలోచన చేస్తామని తెలిపారు. తాము యశ్వంత్ను ఢిల్లీలో తమ పార్టీ నేతలతోపాటు కలుస్తామని శనివారం ప్రకటించారు. దాంతో ప్రతిపక్షాల మద్దతు కోరే ఉద్దేశంతో రాష్ట్రానికి వచ్చిన యశ్వంత్ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉన్నట్లయింది.