- కేసీఆర్.. మీ నాయకత్వమే దేశానికి శరణ్యం
- కారణజన్ముడవు.. మీ తెలివితేటలు రాష్ట్రానికే పరిమితం కావొద్దు
- ఆలస్యం చేయకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి
- మీరు ముందడుగు వేస్తేనే దేశానికి న్యాయం జరుగుతది
- పోటీ పడి మంత్రులు, టీఆర్ఎస్ లీడర్ల ప్రెస్మీట్లు
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ నాయకత్వమే దేశానికి శరణ్యమని, ఆయన బంగారు తెలంగాణ చేశారని, ఇక బంగారు భారత్ చేయడానికి దేశరాజకీయాల్లోకి వెళ్లాలంటూ టీఆర్ఎస్ లీడర్లు నినాదం అందుకున్నారు. కేసీఆర్ తెలివి తేటలు తెలంగాణకే పరిమితం కావొద్దని అన్నారు. అసాధారణ వనరులున్న ఈ దేశానికి అసాధారణ తెలివితేటలున్న కేసీఆర్ నాయకత్వం అవసరమంటూ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు సహా ముఖ్య నేతలంతా పోటీపడి వరుసగా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సీఎం సొంత పేపర్లో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తున్నారని కథనం ప్రచురించిన తర్వాత టీఆర్ఎస్ నేతలు ప్రెస్మీట్లు పెట్టి స్పందిస్తున్నారు. జిల్లాల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఫోన్లు చేసి తెలంగాణ భవన్కు రప్పించి జాతీయ పార్టీ ఏర్పాటుకు మద్దతుగా ప్రెస్మీట్ పెట్టించారు. బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమని లీడర్లు కొనియాడారు. కేసీఆర్ దార్శనికుడు, జ్ఞాని అని.. ఆయన నాయకత్వంలోనే దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని చెప్పారు. ‘‘దేశంలోని దుర్మార్గాలను అరికట్టే దమ్మున్న నేత కేసీఆర్. కారణ జన్ముడైన కేసీఆర్ దేశానికి కచ్చితంగా న్యాయం చేస్తరు” అని అన్నారు.
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణను కంటికి రెప్పలా కాచుకునేందుకు సమర్థమైన యువ నాయకత్వం రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. మోడీది రాక్షస పాలన అని, ఏ వర్గానికి న్యాయం జరగడం లేదని, దేశంలో ప్రతిపక్షం ఫెయిల్ అయిందని, కాబట్టి బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ ముందడుగు వేస్తే తామంతా ఆయన వెంట నడుస్తామని ప్రకటించారు. ‘‘రావాలి కేసీఆర్.. కావాలి కేసీఆర్.. గెలవాలి కేసీఆర్ అని దేశ ప్రజలంతా కోరుతున్నరు” అని చెప్పారు. దేశంలోని దొంగల భరతం పట్టాలంటే ఆలస్యం చేయకుండా దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టాలన్నారు. సంఖ్యాబలం ముఖ్యం కాదని, సంకల్పబలమే ముఖ్యమని, అది కేసీఆర్కు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఏడాదిన్నరగా సాగుతున్న ఊహాగానాలకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడుతుందని, నేషనల్ పాలిటిక్స్లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలె: టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు
‘‘తెలంగాణను బాగు చేసినట్టే దేశాన్ని బాగు చేయడానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలె” అని టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. పేదలు, రైతులు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే తెలంగాణ మోడలే దేశమంతా రావాల్సి ఉందని అన్నారు. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరుగలేదని విమర్శించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కేసీఆర్ ముందడుగు వేయాలని, తెలంగాణ సమాజం మొత్తం ఆయన వెన్నంటి ఉంటుందని అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ 21 జిల్లాల అధ్యక్షులు తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరారు. ప్రెస్మీట్లో దాస్యం వినయ్ భాస్కర్, గువ్వల బాలరాజు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోతు కవిత, బడుగుల లింగయ్య యాదవ్, జీవన్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, మెతుకు ఆనంద్, పద్మా దేవేందర్ రెడ్డి, ఆరూరి రమేశ్, కోరుకంటి చందర్, శంబీపూర్ రాజు తదితరులు మాట్లాడారు. మునుగోడు సభ నుంచి నిజామాబాద్ సభ దాకా ప్రజలు కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరారని తెలిపారు. దేశంలోని బాధలు పోవాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలన్నారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల్లో స్పందన లేదన్నారు. కేసీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని కోరారు. హైదరాబాద్లో 21 జిల్లాల అధ్యక్షులు కలిసి ప్రెస్మీట్ పెట్టామని, ఇక్కడికి రాలేకపోయిన మిగతా 12 జిల్లాల అధ్యక్షులు తమ జిల్లాల్లో ప్రెస్మీట్లు పెట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారని వారు తెలిపారు.
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం: ఇంద్రకరణ్ రెడ్డి
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. రాదనుకున్న తెలంగాణ తెచ్చి అభివృద్ధి చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని, ఇప్పుడు దేశంలో గుణాత్మక మార్పు కోసం దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని చెప్పారు. మోడీని గద్దె దించాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నాయకుడితోనే సాధ్యమవుతుందన్నారు.
చారిత్రక అవసరం: జగదీశ్ రెడ్డి
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం చారిత్రక అవసరమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలంతా కోరుతున్నరు. ప్రజల మధ్య బీజేపీ వైషమ్యాలను రెచ్చగొడుతున్నది. కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా మారింది” అని పేర్కొన్నారు. తెలంగాణ మాదిరిగానే కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని చెప్పారు.
మోడీ, షాను ప్రశ్నించడానికి కేసీఆర్ బయల్దేరిండు: ప్రశాంత్ రెడ్డి
దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ, ప్రజల మధ్య మోడీ, అమిత్ షా చిచ్చు పెడుతున్నారని, వారిని ప్రశ్నించడానికే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి బయల్దేరారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన.. కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు రూ.11.50 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేశారని దుయ్యబట్టారు. అదానీకి దోచిపెట్టిన దాంట్లో మోడీ, అమిత్ షా వాటా ఎంతని అని ప్రశ్నించారు. వీటిపై నిలదీయడానికే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, ఇది తెలంగాణ ప్రజలకే గర్వకారణమని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. అందరూ కేసీఆర్కు మద్దతివ్వాలని, కేసీఆర్ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.