
పార్టీలో చేరాలంటూ ఫోన్
తిరస్కరించిన బీజేపీ నేత
సోషల్ మీడియాలో వైరలైన ఆడియో క్లిప్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలవడానికి టీఆర్ఎస్ కు అవసరానికంటే ఎక్కువగానే మద్దతుదారుల బలముంది. అయినప్పటికీ ఇతర పార్టీల నేతలకు గాలం వేయడం మాత్రం మానడం లేదు. తెల్లారితే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా బీజేపీ ప్రజాప్రతినిధులను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నిజామాబాద్ మాజీ మేయర్ భర్త ఒకరు బీజేపీ కార్పొరేటర్ తో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరలైంది. టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఏది కావాలంటే అది చేద్దామని ఎమ్మెల్యే చెబుతున్నారని, పార్టీలో చేరాలని కోరుతున్నారంటూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23 వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీకి చెందిన మేకల మల్లేష్ యాదవ్ కు ఓ ప్రముఖ టీఆర్ఎస్ నేత ఫోన్ చేశారు. ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నానంటూనే చెప్పాల్సింది చెప్పేసిన టీఆర్ఎస్ నేతకు బీజేపీ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గట్టి సమాధానం చెప్పారు. అవసరమైతే అడుక్కుతింటానని, పార్టీ మాత్రం మారనని తెగేసి చెప్పారు.
ఒక్కరోజులోనే సొంత గూటికి..
మూడు రోజుల క్రితం కూడా బీజేపీకి చెందిన 44 వ డివిజన్ కార్పొరేటర్ సుధా మధు టీఆర్ఎస్ లో చేరినట్లే చేరి ఒక్కరోజులోనే తిరిగి సొంత గూటికి చేరారు. ఇది తనకు అవమానంగా భావించిన కవిత స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తపై మండిపడ్డట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా మాజీ మేయర్ భర్త బీజేపీ కార్పొరేటర్తో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరలైంది. పోలింగ్ కు ముందు జరిగే ఈ పరిణామాలపై కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మాత్రం మేనేజ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటూ ఆమె ఫైర్ అయినట్లు సమాచారం. పోలింగ్ జరిగే చివరి క్షణం వరకు ప్రయత్నాలు కొనసాగించాలని ఎమ్మెల్యేలకు పైనుంచి ఆదేశాలందినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వీరి ప్రయత్నాలు కూడా అదే తరహాలో జరుగుతున్నాయి.
https://www.youtube.com/watch?v=q3aUpGaQ1dw&feature=youtu.be