మాజీ ఎంపీ కవిత గెలుపుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరాటం
మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల్లోని నేతలకు గాలం
పోలింగ్ టైం దగ్గరికొచ్చినా కొనసాగుతున్న చేరికలు
నిజామాబాద్, కామారెడ్డి , వెలుగు: రేపు జరగనున్న నిజామాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటం మాటేమోగానీ టీఆర్ఎస్ఎమ్మెల్యేలకు ఆరాటం మాత్రం ఎక్కువైంది. తమ పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవితను ఎలాగైనా ఎమ్మెల్సీ చేయాలనే కసితో కొన్నాళ్లుగా ఆపరేషన్ ఆకర్ష్పైనే ఫోకస్ పెట్టారు. అది ఏస్థాయిలో ఉందంటే ఎన్నికలకు ఒక్కరోజు గ్యాప్లో కూడా పక్క పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను లాగి గులాబీ కండువా కప్పుతున్నారు.
ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ..
నిజామాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ స్థానంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్పార్టీ నుంచి గెలిచినవారు 494 మంది. అంటే సుమారు 60 శాతం రూలింగ్ పార్టీకి చెందిన వారే. ఏ లెక్కన చూసినా టీఆర్ఎస్ అభ్యర్థికే మెజారిటీ ఉంది. కానీ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మాజీ ఎంపీ కవితను ఎలాగైనా ఎమ్మెల్సీని చేయాలని ఆరాటపడుతున్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. ఇందులో భాగంగా ఇందూరులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను నయానో, భయానో తమ పార్టీలోకి లాగుతూ వచ్చారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్నా టీఆర్ఎస్ ఆపరేషన్ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మందిపైగా ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకొన్నారు.
ప్రలోభాలు, బెదిరింపులతో..
ఇందూరు లోకల్బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్వచ్చింది. ఏప్రిల్లో పోలింగ్జరగాల్సి ఉండగా, కరోనాతో వాయిదా పడింది. చివరకు ఈ నెల 9న నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్గ్రీన్సిగ్నల్ఇచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచాయి. ఎమ్మెల్సీ పదవీ కాలం 15 నెలలే ఉన్నప్పటికీ టీఆర్ఎస్తరఫున నిజామాబాద్మాజీ ఎంపీ, సీఎం బిడ్డ కల్వకుంట్ల కవిత పోటీలో ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన కవిత, ప్రస్తుత బీజేపీ ఎంపీ అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్తో మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత ఓటమి నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాల మేరకు జిల్లా ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. టీఆర్ఎస్కు పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిదని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు. ఎమ్మెల్యేలైతే ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సుమారు 100 మందివరకు తమ పార్టీలోకి లాగారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో ఈ చేరికలు కొనసాగాయి. ఇందుకోసం ఎమ్మెల్యేలు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారనే వార్తలు వచ్చాయి. ఒకవైపు అభివృద్ధికి నిధులు, ఫ్యూచర్పై భరోసా, ఇతరత్రా ప్రలోభాలతోపాటు వివిధ కేసులు, సమస్యలు ఉన్నవారిని బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈక్రమంలో గడిచిన మార్చి నెలలోనే పదుల సంఖ్యలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కారెక్కారు. ఎన్నికలు వాయిదా పడడంతో చేరికలను టెంపరరీగా నిలిపివేసినా ఇటీవల పోలింగ్ తేదీ ఖరారు కాగానే మళ్లీ స్టార్ట్ చేసి, పోలింగ్ ముందురోజు దాకా కొనసాగించారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
శుక్రవారం జరిగే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ సి. నారాయణ రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 50 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనుండగా, 24 మంది కోవిడ్ పాజిటివ్ ఓటర్లకు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటు చేసేందుకు చాన్స్ ఇస్తామని చెప్పారు.