
అడ్వకేట్ దంపతుల హత్య కేసుతో TRS పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు సీఎం కేసీఆర్. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టంలో పోలీసు శాఖ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో కూడా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదన్నారు. అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం...ఖండిస్తున్నాం. ఈ హత్య కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టం. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశాం. ఈ కేసును రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేస్తారని చెప్పారు.కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కప్ప కుమార్, శ్రీనివాస్, బడారి లచ్చయ్య, వెల్ది వసంతరావును పోలీసులు అరెస్టు చేశారు. లాయర్ దంపతుల హత్య కేసులో మాకు, మా పార్టీకి అసలు ప్రమేయం లేదు. హత్య కేసులో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే పార్టీ నుంచి తొలగించాం. అతన్ని అరెస్టు కూడా చేశారు. వారు కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు. వాళ్లు ఇప్పుడు జైల్లో ఉన్నారన్నారు.