హైదరాబాద్: ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి ప్రతి ఒక్కరూ గులాబీ రంగు దుస్తులు వేసుకొని రావాలని, ఆహ్వానించిన వారు మాత్రమే రావాలని సూచించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం ఆయన హైటెక్స్ HICCలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు ఆరువేల మందికి పైగా ప్రతినిధులు ప్లీనరీకి వస్తారని చెప్పారు. ఇవాళ సాయంత్రం వరకు ఆహ్వాన పాసులు అందిస్తామన్నారు. అక్టోబర్-25న ఉదయం 11 గంటలకు ప్లీనరీ సభ ప్రారంభమవుతుందన్న కేటీఆర్.. ప్లీనరీలో 7 అంశాలపై తీర్మానాలు చేస్తామన్నారు. కేంద్రం మాటిచ్చి తప్పిన హామీలను గుర్తు చేస్తామని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ కొనసాగుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నామని చెప్పిన కేటీఆర్ .. నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, ప్రజలు వచ్చే విధంగా చూడాలన్నారు. గులాబీ దండు కదలిరావాలన్నారు.