నదిలో పడ్డ ఆర్మీ ట్రక్కు .. 9 మంది జవాన్లు మృతి

నదిలో పడ్డ ఆర్మీ ట్రక్కు .. 9 మంది జవాన్లు మృతి

న్యూఢిల్లీ:  లడఖ్​లోని లేహ్​లో ఆర్మీ కాన్వాయ్​లోని ఓ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) మరణించారు. లేహ్​కు 150 కిలోమీటర్ల దూరంలోని కియారీ వద్ద శనివారం సాయంత్రం 4.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ ఎస్పీ పీడీ నిత్య వెల్లడించారు.ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్ లో ఐదు వెహికల్స్ ఉన్నాయని, నదిలో పడిపోయిన ట్రక్కులో 10 మంది జవాన్లు ఉన్నారన్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారని, గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఆస్పత్రికి తరలించేటప్పటికే 8 మంది చనిపోయారని, మరొకరు చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. ఆర్మీ జవాన్ల మృతి బాధాకరమని, దేశానికి వారు చేసిన అసాధారణ సేవలను ఎన్నటికీ మరవబోమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.