అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినాలో ప్రచారం కోసం వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు రెండు సార్లు ఓటేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. కరోనా కారణంగా మెయిల్ ఓటింగ్ నిర్వహించనున్నారు. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. మెయిల్ ఓటింగ్ ద్వారా డెమోక్రటిక్ పార్టీ రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ఆరోపించారు. అందుకే నార్త్ కరోలినా ప్రజలు రెండు సార్లు ఓటు వేయాలన్నారు. మొదట మెయిల్ ద్వారా ఓటు వేసి.. ఆ తర్వాత పోలింగ్ బూత్లో బ్యాలెట్ ఓటును కూడా వినియోగించుకోవాలన్నారు. ఈ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తే… అక్రమాలు జరగవన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో రెండు సార్లు ఓటు హక్కును వినియోగించుకోవడం నేరం. ఆ దేశ ఎన్నికల సంఘం కూడా ఇదే చెబుతోంది. రెండుసార్లు ఓటు వేయాలని ట్రంప్ మాట్లాడగానే.. రెండు సార్లు ఓటు వేయడం చట్టవ్యతిరేకమంటూ నార్త్ కరోలినా ఎన్నికల బోర్డు ప్రకటన జారీ చేసింది. ఫెడరల్ చట్టానికి విరుద్ధమని ఎన్నికల సంఘం తెలిపింది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసి నేరానికి పాల్పడినట్లు ఎన్నికల అధికారులు ఆరోపిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించాలని అధ్యక్షుడు రెచ్చగొట్టడం సరికాదన్న అభిప్రాయాలు ప్రజల్లో విన్పిస్తున్నాయి.