
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య తానే సీజ్ఫైర్ ఒప్పందం చేయించినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాటిమాటికి ప్రకటించుకోవడం దేశానికి అవమానకరమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరువిప్పడం లేదని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే నిలదీశారు. ప్రధాని నరేంద్రమోదీ వెంటనే సమాధానం చెప్పాలని ఆయనతోపాటు కాంగ్రెస్ సభ్యులు సోమవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్లో ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు.
పహల్గాం టెర్రర్ దాడి యావత్ దేశాన్ని కలచివేసిందని, టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పూర్తి మద్దతిచ్చాయని ఆయన అన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భద్రతా లోపాలు, ఫారిన్ పాలసీపై రెండురోజులు సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఆ టెర్రరిస్టులను పట్టుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
అన్నింటిపై చర్చిస్తాం: నడ్డా
ఖర్గే డిమాండ్లపై సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. కాగా, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైనప్పుడు కూడా కాంగ్రెస్ సభ్యులు ఇదే అంశంపై పట్టుబట్టారు. ఆపై కేంద్రం తీరుకు నిరసనగా.. వాకౌట్ చేశారు. అంతకుముందు సభలో నలుగురు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.