- పడగొట్టి అక్కడే కొత్తది కడదామా..
- మరోచోట ఎక్కడన్నా నిర్మిద్దామా?
- ప్రభుత్వంలో తర్జనభర్జన
- కోర్టు తీర్పు చదవలేదన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: ఎర్రమంజిల్ను కూల్చొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇప్పటికే అక్కడ అసెంబ్లీ నిర్మాణానికి సీఎం భూమి పూజ కూడా చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే సెక్రటేరియెట్ భవనాలతో పాటు ఎర్రమంజిల్బిల్డింగ్నూ కూల్చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుతో ఏంచేయాలనే విషయంపై సర్కారు తర్జనబర్జన పడుతోంది. ఎర్రమంజిల్కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన రాజకీయ పార్టీలు కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్లు అక్కడే భవన నిర్మాణం చేయాలంటే ఏంచేయాలనే దానిపై ప్రభత్వం చర్చలు జరుపుతోంది. సీఎం కేసీఆర్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయరని, అసెంబ్లీ నిర్మాణంపై ఆయన ఏంచేయబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కూల్చివేత నిర్ణయంలో నిబంధనలు పక్కన పెట్టిందనేది కోర్టు అభ్యంతరం.. అందువల్ల నిబంధనల ప్రకారమే ఎర్రమంజిల్ను వారసత్వ కట్టడాల జాబితాలో నుంచి తొలగించే అవకాశం ఉందని మరో అధికారి చెప్పారు. దీనికోసం హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీని ఏర్పాటు చేసి, నెలరోజుల్లో నివేదిక తెప్పించుకుని ఆపై ఎర్రమంజిల్ను కూల్చివేసే అవకాశం ఉందని ఆర్అండ్బీ అధికారి ఒకరు చెప్పారు.
మరో చోట అసెంబ్లీ నిర్మాణం?
అసెంబ్లీని ఇప్పుడున్న చోటే కొనసాగిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏడాదికి 50 రోజులు జరిగే సమావేశాల కోసం కొత్త బిల్డింగ్ అవసరంలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ మాత్రం ఎలాగైనా కొత్త బిల్డింగ్ కట్టాల్సిందేనని పట్టుదలగా ఉన్నారని ప్రగతిభవన్కు దగ్గరగా ఉండే ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. ఎర్రమంజిల్ లో కాకపోతే మరోచోట అసెంబ్లీ బిల్డింగ్ కట్టే అవకాశం ఉందన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశల వల్ల బిజీగా ఉండడంతో హైకోర్టు తీర్పు కాపీని ఇంకా చదవలేదని ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. జడ్జిమెంట్కాపీ పూర్తిగా చదివాకే ఏంచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.