
- అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా..
- ఎఫ్ఈవో, ఏస్ నెక్స్ట్ జెన్ అకౌంట్ల ఆధారంగా విచారణ
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఐఏఎస్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం నోటీసులిచ్చి వారం రోజుల వ్యవధిలో ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్నట్లు తెలిసింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా బిట్రన్లోని ఎఫ్ఈవో అకౌంట్కు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపైనే ఈడీ దృష్టి పెట్టింది.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దేశం దాటి వెళ్లిన డబ్బు బిట్రన్లోని ఎన్ని అకౌంట్లలో డిపాజిట్ అయ్యింది? ఆయా అకౌంట్ల నుంచి మళ్లీ ఇండియాకు డబ్బులు తరలించారా ? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నది. ఈ మేరకు కేటీఆర్ సహా ముగ్గురిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్(పీఎమ్ఎల్ఏ), ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) కింద ఇప్పటికే ఆధారాలు సేకరించింది.
అకౌంట్ల లావాదేవీలపై ఫోకస్
కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 8న అర్వింద్ కుమార్ను, 9న బీఎల్ఎన్ రెడ్డిని,16న కేటీఆర్ను ఈడీ అధికారులు విచారించారు. వీరు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కార్ రేసింగ్ ఈవెంట్లకు సంబంధించిన అగ్రిమెంట్లు, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల అకౌంట్ల లావాదేవీలను అధికారులు పరిశీలించారు. హెచ్ఎండీఏ బోర్డు హెడ్ ఆఫ్ అకౌంట్ సహా ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థల బ్యాంక్ అకౌంట్లు, ఈ మూడింటి మధ్య 2022 జూన్ నుంచి 2024 వరకు జరిగిన లావాదేవీలను ఇప్పటికే సేకరించారు.
సీజన్ 9,10 నిర్వహణలో భాగంగా హెచ్ఎండీఏ బోర్డ్ అకౌంట్నుంచి 2023 అక్టోబర్3,11 వ తేదీల్లో బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు రూ.45.71 కోట్లు బదిలీ చేసిన వ్యవహారంపైనే ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది.