
ఆసిఫాబాద్, వెలుగు: మహనీయుల త్యాగాల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాటవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమానికి అడిషనల్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, యాదవ సంఘాల నాయకులు, వైశ్య సంఘాల నాయకులు, అధికారులతో కలిసి దొడ్డి కొమురయ్య, కొణిజేటి రోశయ్య ఫోటో వద్ద జ్యోతిని వెలిగించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన మహనీయులందరిని స్మరించుకుంటూ వారి త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధికి కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బహుజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేశారని తెలిపారు. మహనీయుల త్యాగాలను, సేవలను భావితరాలకు అందించాలని తెలిపారు.