రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై సెప్టెంబర్ 19 వరకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సీనియారిటీ జాబితాపై ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఈరోజు(సెప్టెంబర్ 16) విచారణకు వచ్చింది. 

జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లా కేటాయించారని పిటిషనర్లు వాదించారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వకుండా పదోన్నతులకు సిద్ధమయ్యారన్న పిటిషనర్లు వెల్లడించారు.

అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది స్పష్టం చేశారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వబోమని.. పూర్తి వివరాలు సమర్పించేందుకు సెప్టెంబర్ 19 వరకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్ఈ, రంగారెడ్డి డీఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. ప్రాథమిక సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది.