
హైదరాబాద్, వెలుగు : టీఎస్ రెడ్కోలో ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేస్తున్న అమరేందర్రెడ్డి బదిలీని నిలిపివేయాలని ఆల్ ఇండియా రెన్యువబుల్ ఎనర్జీ ఎంటర్ ప్రెన్యూర్స్ అసోసియేషన్ కోరింది. బుధవారం ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు సెక్రటేరియెట్లో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందించారు. అమరేందర్ రెడ్డి బదిలీతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.16 కోట్ల సబ్సిడీ నిధులు జాప్యం అవుతాయని విన్నవించారు.
కేంద్రం అమలు చేస్తున్న సూర్య ఘర్ యోజన పథకం, పీఎం కుసుమ్ అమలులో సైతం జాప్యం జరిగే అవకాశం ఉన్నందున కనీసం మూడు నెలలైన బదిలీని నిలిపివేయాలని కోరారు. కేంద్రం నుంచి గత రెండేండ్లుగా నిలిచిపోయిన రూ.16 కోట్ల సబ్సిడీ నిధులు త్వరగా ఇప్పించాలని డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఆసోసియేషన్ జనరల్ సెక్రటరీ చారుగుండ్ల భవాణి సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఇంద్ర సేనారెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.