హైదరాబాద్, వెలుగు: విజయ డెయిరీ రాష్ట్రవ్యాప్తంగా మరో 2000 అవుట్లెట్స్ను ప్రారంభించడంతోపాటు మరో 100 కొత్త ప్రొడక్టులను తేనుందని తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో-–ఆపరేటివ్ ఫెడరేషన్ (టీఎస్డీడీసీఎఫ్) ప్రకటించింది. హైదరాబాద్లో శుక్రవారం హైటెక్స్లో డెయిరీ/ఫుడ్ ప్రొడక్ట్స్, ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్తో కూడిన ట్విన్ డెయిరీ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఇది మూడు రోజుల కార్యక్రమం. డెయిరీ/ఆహార ఉత్పత్తులు, ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్ మెషినరీ, అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఇది. దీనిని మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ సోమ భరత్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు మూతపడిన విజయ డెయిరీ ఇప్పుడు బాగా పనిచేస్తోందని, పోయిన ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1000 కోట్ల టర్నోవర్ను టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారు. ‘‘ప్రస్తుతం విజయా డెయిరీకి సుమారు 1000 అవుట్లెట్స్ ఉన్నాయి. మా వద్ద 27 ఉత్పత్తులు ఉన్నాయి.
కొత్తగా మిల్క్ షేక్, కాఫీ, టీ, ఫ్లేవర్డ్ మిల్క్, ఐస్ క్రీం, కుల్ఫీ, కుకీలు, హెల్త్ బార్లు మొదలైన 100 ప్రొడక్టులను తేబోతున్నాం. హైదరాబాద్కు ప్రతిరోజు కోటి లీటర్ల పాలు అవసరం. ఉత్పత్తి 70 లక్షలు మించడం లేదు. పాల ఉత్పత్తిని పెంచడానికి రెండు లక్షల జంతువులను కొని రైతులకు ఇస్తాం. దీని ద్వారా సుమారు 6 నుండి 8 లక్షల లీటర్ల అదనపు ఉత్పత్తి సాధ్యపడుతుంది”అని వివరించారు. ఈ ఎక్స్పోలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, గోద్రెజ్ క్రీమ్లైన్ జెర్సీ ప్రొడక్ట్స్, దొడ్ల డెయిరీ వంటి 105 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఎగ్జిబిషన్ను దాదాపు 7500 మంది చూస్తారని అంచనా. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్కి మద్దతుగా మీడియా డే మార్కెటింగ్ ఈ ప్రదర్శనను నిర్వహించిందని ఎస్డీడీసీఎఫ్ తెలియజేసింది.