- 5,07,840 మంది క్వాలిఫై పార్ట్–2 అప్లికేషన్లతో ఫిజికల్, ఎఫిషియెన్సీ టెస్ట్లు
- ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తుకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రిలిమినరీ ఎగ్జాంలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(టీఎస్ఎల్పీఆర్బీ) శుక్రవారం ప్రకటించింది. ఫిజికల్ మెజర్మెంట్, ఎఫిషియెన్సీ టెస్ట్లకు 5,07,840 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్బీ డైరెక్టర్ వీవీ శ్రీనివాస్ రావు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హులైన అభ్యర్థుల వివరాలు పోలీస్ వెబ్సైట్ (https://www.tslprb.in/) లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అర్హత సాధించిన వాళ్లు పార్ట్–2 అప్లికేషన్లను అప్లోడ్ చేయాలని సూచించారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సివిల్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, జైల్స్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. 554 ఎస్ఐ,15,644 కానిస్టేబుల్ పోస్టులకు, 614 ఎక్సైజ్, 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.54 లక్షల మంది అభ్యర్థులకు గాను 5,07,840 అభ్యర్థులు ఫిజికల్ మెజర్మెంట్, ఎఫిషియెన్సీ టెస్ట్లకు అర్హత సాధించారు. రిజర్వేషన్ల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. అర్హులైన అభ్యర్థుల వివరాలను కేటగిరీల వారిగా వెల్లడించారు.
ఈవెంట్ల కోసం ఏర్పాట్లు..
ఫిజికల్ టెస్ట్లకు అర్హత సాధించిన వారిలో పురుషులకు1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారు లాంగ్ జంప్, షాట్పుట్ పోటీలకు అర్హులౌతారు. ఈవెంట్స్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లను సెలెక్ట్ చేసిన తర్వాత ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా సెన్సర్లు, స్కానర్లతో డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. పార్ట్–2లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు కేటాయించిన సెంటర్లు, ఈవెంట్ డేట్ల వివరాలను తెలియజేయనున్నారు.