
- కమిషన్ను ప్రక్షాళన చేసి నోటిఫికేషన్లు వేయాలి
- ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర.. పలువురి అరెస్ట్
ఓయూ, వెలుగు : టీఎస్పీఎస్సీ చైర్మన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని బహుజన విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చైర్మన్తో పాటు సభ్యులను కూడా తొలగించి కమిషన్ను ప్రక్షాళన చేయాలన్నారు. మంగళవారం ఓయూ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా స్టూడెంట్లు డప్పు వాయిద్యాలతో శవయాత్ర చేశారు. సీఎం దిష్టిబొమ్మతో ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న స్టూడెంట్లు.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకొన్నారు.
స్టూడెంట్లను అరెస్టు చేసి ఓయూ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ , ఓయూ జాక్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దొంగల చేతికి తాళాలు ఇచ్చిందని మండిపడ్డారు. ఆ దొంగలే సంతలో సరుకు లెక్క కోట్ల రూపాయలకు క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారని విమర్శించారు. పేపర్ లీకేజీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బోర్డు చైర్మన్, సభ్యులు, కార్యదర్శి మళ్లీ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు.
ఇది నలబై లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమే అన్నారు. వెంటనే బోర్డును ప్రక్షాళన చేసి నూతన బోర్డును ఏర్పాటు చేయాలని, అంత వరకూ పరీక్షలు నిర్వహించకూడదని డిమాండ్ చేశారు. సీఎంవోలో కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి బావ ఎల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి లాంటి వారిని రాజ్యాంగబద్ధ సంస్థలో సభ్యులుగా ఎలా నామినేట్ చేస్తారని నిలదీశారు. నూతన బోర్డును ఏర్పాటు చేసి, ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.