- సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు కమిషన్ ఆదేశం
- ఆ రిపోర్టు తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం
- గ్రూప్ 1 ఎగ్జామ్ ఎస్ఎఫ్ఎస్ ఇష్యూపై టీఎస్పీఎస్సీ భేటీ
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్లోని సెయింట్ ఫ్రానిస్ స్కూల్(ఎస్ఎఫ్ఎస్) లో జరిగిన గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇష్యూపై టీఎస్పీఎస్సీ సీరియస్ గా ఉంది. ఆరోజు ఆందోళనలో పాల్గొన్న 47 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను వాల్యువేషన్ చేయాలా లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం టీఎస్పీఎస్సీ ఆఫీసులో కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్ కు బదులు ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజీ క్వశ్చన్ పేపర్లు రావడంపై చర్చించారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. కానీ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు చైర్మన్ జనార్దన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. మినిట్ టు మినిట్ వివరాలు ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. ఆ సెంటర్లో పేపర్లు తారుమారు కావడానికి గల కారణాలనూ ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. అయితే 47 మందికి ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజీ క్వశ్చన్ పేపర్లు రావడంతో, వెంటనే పొరపాటును గుర్తించి వారికి సరైన క్వశ్చన్ పేపర్లు ఇచ్చినా పరీక్ష రాసేందుకు వారు ముందుకు రాలేదు. పరీక్ష జరుగుతున్న సమయంలో కొందరు అభ్యర్థులు ఇతరులను ఇబ్బందులకు గురిచేయడంపై కమిషన్ సీరియస్గా ఉంది. వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది. మరోపక్క కలెక్టర్నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత ఆ 47 అభ్యర్థుల పేపర్లను వాల్యువేషన్ చేయాలో వద్దో నిర్ణయం తీసుకుంటామని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా అబిడ్స్లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో, స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో ఆలస్యంగా పరీక్ష రాసిన స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు.
50 శాతం ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తి
ఈ నెల 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ జరుగుతోంది. 3.80 లక్షల మందికి 2.86 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. శుక్రవారం నాటికి సగానికి పైగా ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ వెంటనే వాటిని వెబ్ సైట్లో పెడ్తామని పేర్కొన్నారు. ఆ వెంటనే ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
