
- లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ
- ఇప్పటికే మూడు సార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా
- కేవలం నోటిఫికేషన్ కే పరిమితమైన గ్రూప్ 3
- పేపర్ లీక్తో రద్దయిన డీఏఓ ఎగ్జామ్దీ అదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కీలకమైన గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై స్పష్టత కరువైంది. కొత్త కమిషన్ వచ్చిన తర్వాత పలు పరీక్షల నిర్వహణ వేగవంతం చేసినా.. కీలకమైన ఈ రెండు పరీక్షలపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు మూడు సార్లు పరీక్ష తేదీలు ఇచ్చి వాయిదా వేశారు. గ్రూప్ 3 ఎగ్జామ్ కు కనీసం పరీక్ష తేదీని కూడా ప్రకటించలేదు. ఈ క్రమంలో కొత్త కమిషన్ రావడంతో వాటి నిర్వహణపై అందరి దృష్టి పడింది. కానీ, టీఎస్పీఎస్సీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. ఆయా పరీక్షల తేదీల కోసం లక్షలాది మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోపక్క పేపర్ లీకై రద్దయిన డీఏఓ ఎగ్జామ్ నిర్వహణపైనా ఇదే అయోమయం నెలకొన్నది.
2022లో రిలీజైన గ్రూప్ 2 నోటిఫికేషన్..
గత బీఆర్ఎస్ సర్కారు.. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్రిలీజ్ చేసింది. 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఆ సమయంలో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో.. వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేయడంతో ఆ పరీక్షలను టీఎస్పీఎస్సీ వేయిదా వేసింది. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది. ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో మరోసారి గ్రూప్2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సర్కారు రావడంతో నాటి కమిషన్ చైర్మన్ సహా, సభ్యులు రాజీనామా చేశారు. దీంతో పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని, మరోసారి వాయిదా వేశారు. దీంతో మూడోసారీ వాయిదా పడింది.
గ్రూప్ 3, డీఏఓ పరీక్షల మాటేలేదు
రాష్ట్రంలో 1,363 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అదనంగా మరో 12 పోస్టులు చేర్చారు. మొత్తం 1,375 పోస్టుల కోసం 5.36 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ఆ పరీక్ష తేదీని ప్రకటించలేదు. గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 పరీక్ష పెడ్తారని అంతా ఎదురుచూశారు. కానీ, గ్రూప్ 2 పరీక్ష మూడు సార్లు వాయిదా పడటంతో.. గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహణ ఊసే కరువైంది. మరోపక్క 2022 ఆగస్టులో 53 డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
ఈ పరీక్షకు 1.06 లక్షల మంది అప్లై చేశారు. గతేడాది ఫిబ్రవరి 26న పరీక్ష కూడా నిర్వహించారు. కానీ, అప్పట్లో పేపర్ లీక్ కావడంతో గతేడాది మార్చిలో ఆ పరీక్షను రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహణపై ఎలాంటి అప్డేట్ లేదు. ఆ పేపర్తో పాటు రద్దయిన ఏఈఈ ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించి, ఫైనల్ కీ కూడా ఇచ్చారు. కానీ, డీఏఓ ఎగ్జామ్ నిర్వహణపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కాగా.. వాయిదా పడిన, రద్దయిన అన్ని పరీక్షల నిర్వహణపై కొత్త కమిషన్ స్పందించాలని లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.