
- కమిషన్ను వెంటనే రద్దు చేయాలె
- కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు పెట్టాలె
- సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
సికింద్రాబాద్, వెలుగు: గ్రూప్-–1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మళ్లీ రద్దు కావడంపై అభ్యర్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. టీఎస్పీఎస్సీ వైఖరిని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్లు శనివారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వర్సిటీ లైబ్రరీ నుంచి ర్యాలీ నిర్వహించి, మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని, సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థులను ఓయూ పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. అవినీతి అడ్డాగా మారిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసే వరకు ఊరుకునేది లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కలిసి మార్కెట్లో చేపలను అమ్మినట్లు, ప్రతి పేపర్ని అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద, టీఎస్పీఎస్సీ బోర్డు మీద తమకు నమ్మకం పోయిందన్నారు.
ఎన్నో ఆశలతో తమ తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు పంపిస్తుంటే, ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం చదువుతున్నామని.. కానీ సర్కారు, టీఎస్పీఎస్సీ తీరుతో తమకు నిరాశే ఎదుర వుతోందన్నారు. కమిషన్ చైర్మన్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే గ్రూప్ 1 ఎగ్జామ్లు నిర్వహించాలన్నారు. లేనిపక్షంలో ప్రతి విద్యార్థి రానున్న ఎన్నికల్లో గ్రామ గ్రామాన తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేలా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. అరెస్టు అయిన విద్యార్థుల్లో క్రాంతి, నరసింహ, తేజావత్ వెంకట్నాయక్, రవితేజ, మేడే శ్రీను, గణేశ్, శాంతి కుమార్, బోనాల నగేశ్ ఉన్నారు.
టీఎస్పీఎస్సీపై నమ్మకం పోయింది: ఏబీవీపీ
టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిందని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు జీవన్ పేర్కొన్నారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీ అనంతరం ప్రభుత్వం పకడ్బందీగా పరీక్ష నిర్వహించకుండా అనేక లోపాలతో చేప ట్టడం వల్లే మరోసారి హైకోర్టు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసిందన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ వెంటనే యువతకు క్షమాపణ చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కమిషన్ చైర్మన్, సభ్యులు రాజీనామా చేయాలన్నారు.