TSPSC Paper Leak : ఇద్దరే దోషులని ఎలా చెప్తారు : రేవంత్ రెడ్డి

TSPSC Paper Leak : ఇద్దరే దోషులని ఎలా చెప్తారు : రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తప్పుచేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పరీక్షా ఎట్లా రాస్తారు అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీలను విచారించాలని కోరారు. ఆ ఘటనపై సీఎం కేసీఆర్ మంత్రులతో, అధికారులతో సమీక్ష చేశారని, ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరే దోషులని చెప్పారన్నారు. కేటీఆర్ అలా ఎలా చెప్తారు అని మండిపడ్డారు. పేపర్ లీక్ లో కేటీఆర్ పీఏ తిరుపతి ఇన్వాల్మెంట్ ఉందన్న ఆయన.. తిరుపతి, రాజశేఖర్ ఇద్దరివీ ఒకటే మండలం అని చెప్పారు. వీరిద్వారా పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. వారి మండలంలో వందకు పైగా మార్కులు వచ్చాయని తెలిపారు. దానిపై ప్రశ్నిస్తేనే తనకు సిట్ నోటీసులు జారీ చేశారని విమర్శించారు.

భయపెట్టడానికి తనకు నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో ఉన్నా సిట్ ముందుకొచ్చానని, తన వద్ద ఉన్న సమాచారం, అభిప్రాయాలను సిట్ చీఫ్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కు ఇచ్చానని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ను విచారించకుండా తనకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేటీఆర్ మాట్లాడిన ప్రెస్ మీట్ అంశాలతో కూడిన రిపోర్టును సైతం సిట్ కు సమర్పించానని రేవంత్ చెప్పారు. కేటీఆర్ కు ఆ ఇద్దరే దోషులని ఎలా తెలుసు.. అని తాను అడిగినట్టు చెప్పారు.

పేపర్ లీకేజీ బీజేపీ కుట్ర అని మంత్రి కేటీఆర్  చెప్పారని, ఆయన వద్ద అన్ని విషయాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారించండి అని చెప్పానని, గతంలో కేటీఆర్ టీఎస్పీఎస్సీకి వెళ్లి అప్పటి ఛైర్మెన్ ఘంట చక్రపాణిని కలిసిన ఫొటోలు కూడా ఇచ్చానన్నారు. టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు మార్చాలని చెప్పిన విషయం, సిస్టమ్స్ మార్చిన విషయం చెప్పానని రేవంత్ తెలిపారు. ముందు కేటీఆర్ ను అరెస్ట్ చేసి విచారించాలని చెప్పానన్నారు. సిట్ విచారణ మొదలు పెట్టకముందే కేటీఆర్ అలా చెప్పడంతో తమకు కేటీఆర్ పైనే అనుమానం ఉందని రేవంత్ అన్నారు.