కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోకండి: ఆర్టీసీ మాజీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి

కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోకండి: ఆర్టీసీ మాజీ చైర్మన్ అశ్వత్థామ  రెడ్డి

నల్గొండ జిల్లా: సీఎం కేసీఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని  ఆర్టీసి టీఎంయూ మాజీ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మునుగోడు ప్రజలను, ఆర్టీసీ కార్మికులను  కోరారు. శనివారం మునుగోడులో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ప్రజలు, కార్మికులు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో హామీల మీద హామీలు ఇస్తారని... కానీ ఎన్నికల తర్వాత ఏం పట్టించుకోరని సీఎంను విమర్శించారు. ఐదేళ్ల కిందట ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక కోసం కంటితుడుపు చర్యగా ఆర్టీసీ కార్మికులకు  2 డీఏలు మాత్రమే ఇచ్చారని ఫైర్ అయ్యారు.

తెలంగాణ మజ్దూర్ యూనియన్ పుట్టిందే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకని అశ్వత్థామ రెడ్డి గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు ఓటు వేసేటప్పుడు కేసీఆర్ వల్ల చనిపోయిన 34 మంది కార్మికులను గుర్తు చేసుకోవాలని సూచించారు. మునుగోడు బై పోల్ లో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందని అశ్వత్థామ రెడ్డి చెప్పారు.