ఎండాకాలం వచ్చేస్తోంది.. కాదు కాదు వచ్చేసింది.. చాలా ముందుగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఏసీ బస్సులు అందుబాటులోకి రానుండటం ప్రయాణికులకు తీపి కబురుగా తోస్తోంది. టీఎస్ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నాటికి ఎలక్ట్రిక్ బస్సు(Electric bus)లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గ్రేటర్ జోన్ లో 64 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఎయిర్పోర్ట్(Airport) రూట్లలో నడిచే ఏసీ బస్సులకు సాధారణరోజుల్లో 60 శాతం ఆక్యుపెన్సీ ఉంటే, వేసవిలో 85 శాతానికి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఎండలు ముదిరేనాటికి రోడ్లపైకి తెస్తే ఆదరణ పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కొత్త బస్సులను ప్రారంభించారు. TSRTC ఈ ఏడాది జూన్ నాటికి దశలవారీగా 1,325 కొత్త బస్సులను అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి/రాజధాని బస్సులు ఉన్నాయి.