- లిస్ట్‑ఎ క్రికెట్ మ్యాచ్లో హయ్యెస్ట్ రన్స్తో జగదీశన్ వరల్డ్ రికార్డు
- అత్యధిక టీమ్ స్కోరు సహా మరిన్ని రికార్డులు బ్రేక్ చేసిన తమిళ టీమ్
బెంగళూరు: అది విజయ్ హాజరే వన్డే టోర్నమెంట్. ఓవైపు టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన బలమైన తమిళనాడు.. ఇంకోవైపు నార్త్ఈస్ట్కు చెందిన అనామక అరుణాచల్ ప్రదేశ్ జట్టు. సోమవారం ఇరు జట్ల మధ్య పోరు (గ్రూప్–సి)కు చిన్నసైజు బౌండ్రీలతో బ్యాటింగ్కు అనుకూలించే చిన్నస్వామి స్టేడియం వేదికైంది. టాస్ నెగ్గిన అరుణాచల్ ప్రదేశ్.. తమిళనాడుకు బ్యాటింగ్ ఇచ్చేసింది. అంతే.. తొలి ఓవర్ నుంచే ఊచకోత మొదలు పెట్టిన ఓపెనర్ నారాయన్ జగదీశన్ (141 బాల్స్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277) ఫోర్లు, సిక్సర్లతో సునామీ సృష్టించాడు. లిస్ట్–ఎ (డొమెస్టిక్, ఇంటర్నేషనల్ వన్డేలు కలిపి) క్రికెట్ మ్యాచ్లో హయ్యెస్ట్ స్కోరు చేసిన బ్యాటర్గా వరల్డ్ రికార్డు కొట్టాడు. జగ్గికి తోడు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (102 బాల్స్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 154) కూడా సెంచరీతో చెలరేగడంతో 50 ఓవర్లలో 2 వికెట్లకు 506 రన్స్తో లిస్ట్–ఎ క్రికెట్లో అత్యధిక స్కోరుతో తమిళనాడు రికార్డు సొంతం చేసుకుంది. అనంతరం తమిళనాడు బౌలర్ సిద్దార్థ్ (5/12) దెబ్బకు ఛేజింగ్లో అరుణాచల్ 28.4 ఓవర్లలో 71 రన్స్కే ఆలౌటైంది. కష్మ యాంగ్ఫో (17) టాప్ స్కోరర్. దాంతో, తమిళనాడు 435 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగుల తేడాతో గెలుపుతో మరో రికార్డు బద్దలు కొట్టింది. జగ్గి, సాయి సుదర్శన్ పరుగుల మోతతో ఈ మ్యాచ్ మరికొన్ని ఘనతలకు కూడా వేదికైంది. వీరి దెబ్బకు అరుణాచల్ బౌలర్ చేతన్ ఆనంద్ 10 ఓవర్లలో 114 రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ టోర్నీలో వరుసగా ఐదు సెంచరీలు కొట్టి సూపర్ ఫామ్లో ఉన్న జగదీశన్ను చెన్నై ఫ్రాంచైజీ ఈ మధ్యే రిలీజ్ చేసింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ వేలంలో జగ్గిపై కోట్లు కురవడం పక్కా అనొచ్చు.
506/2 లిస్ట్–ఎ క్రికెట్లో ఓ జట్టుకు అత్యధిక స్కోరు. ఈ ఏడాది నెదర్లాండ్స్పై ఇంగ్లండ్ చేసిన 498/4 స్కోరును తమిళనాడు బ్రేక్ చేసింది. ఇండియా డొమెస్టిక్లో 2021లో పుదుచ్చేరిపై ముంబై చేసిన 457/4 స్కోరు ఇప్పటిదాకా హయ్యెస్ట్గా ఉండేది.
435 ఈ మ్యాచ్లో అరుణాచల్పై తమిళనాడు విక్టరీ మార్జిన్. రన్స్ పరంగా లిస్ట్-–ఎ క్రికెట్లో ఇదే హయ్యెస్ట్ విక్టరీ. 1990లో కౌంటీల్లో సోమర్సెట్ 346 రన్స్ తేడాతో డెవోన్ను ఓడించిన రికార్డు బద్దలైంది. ఇండియా డొమెస్టిక్లో గతేడాది జార్ఖండ్ 324 రన్స్ తేడాతో మధ్యప్రదేశ్ను ఓడించడం ఇప్పటిదాకా బెస్ట్ విక్టరీ.
416 జగదీశన్–-సుదర్శన్ తొలి వికెట్కు జోడించిన రన్స్. లిస్ట్-–ఎలో ఏ వికెట్కైనా అత్యధికం. 2015 వన్డే వరల్డ్ కప్లో జింబాబ్వేపై వెస్టిండీస్ బ్యాటర్లు క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్ చేసిన 372 రన్స్ రికార్డు బ్రేక్ అయింది. ఇండియా డొమెస్టిక్ క్రికెట్లో 2019లో గోవాపై కేరళ బ్యాటర్లు సంజూ శాంసన్, సచిన్ బేబీ చేసిన 338 రన్స్ ఇప్పటిదాకా అత్యధికం.
277 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2002లో కౌంటీ క్రికెట్లో గ్లమోర్గన్పై సర్రే తరఫున అలిస్టర్ బ్రౌన్ చేసిన 268 రన్స్ రికార్డును జగదీశన్ బ్రేక్ చేశాడు. 2014లో శ్రీలంకపై రోహిత్ శర్మ 264 రన్స్తో మూడో స్థానంలో ఉన్నాడు.
144 డబుల్ సెంచరీ కోసం జగదీశన్ తీసుకున్న బాల్స్. లిస్ట్–ఎ క్రికెట్లో తక్కువ బాల్స్లో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా ట్రేవిస్ హెడ్ రికార్డును సమం చేశాడు.హెడ్ 2021లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్లాండ్పై ఇన్నే బాల్స్లో డబుల్ సెంచరీ కొట్టాడు.
15 ఈమ్యాచ్లో జగదీశన్ కొట్టిన సిక్సర్లు. డొమెస్టిక్ క్రికెట్లో ఒక మ్యాచ్లో ఎక్కువ సిక్సర్లు చేసిన ప్లేయర్గా నిలిచాడు. 2019లో జార్ఖండ్పై యశస్వి జైస్వాల్ కొట్టిన 12 సిక్సర్ల రికార్డు బద్దలైంది.
5 లిస్ట్-–ఎ క్రికెట్లో జగదీశన్కు ఇది వరుసగా ఐదో సెంచరీ. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ తను. వరుసగా నాలుగు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన కుమార సంగక్కర, అల్విరో పీటర్సన్, దేవదత్ పడిక్కల్ను అధిగమించాడు.