
తిరుపతి: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వెళ్లడానికి లైట్ మెట్రో, మోనో రైల్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆదివారం తిరుపతిలో శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ గౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… కొండపైకి రైలు మార్గం వేసే విషయంపై ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి తో చర్చించామని నివేదిక ఇవ్వమని కోరామని చెప్పారు. నివేదిక వచ్చాక అవసరమైతే ఆగమశాస్త్ర పండితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్ రైల్ తరహా వాటిని తిరుమలకు పరిశీలిస్తున్నామని.. తీగలపై నడిచే రైలు వంటి వాటి జోలికి వెళ్ళటం లేదని చెప్పారు.
తిరుమల పర్యావరణ పరిరక్షణకు రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందని అన్నారు సుబ్బారెడ్డి. ఆస్ట్రియాలో ఎత్తయిన కొండపైకి మోనో రైలు వెళుతోందని.. దాన్ని మోడల్ గా తీసుకొని తిరుమలకు రైలు ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో టిటిడి పై ట్విట్టర్ లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు సుబ్బారెడ్డి. అది అసలు అజిత్ దోవల్ ఖాతా కాదని… ఫేక్ ఎకౌంట్ అని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. టిటిడికి చెందిన 2300కోట్ల ధనాన్ని ప్రభుత్వ ఖజానా కు బదిలీ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ భద్రతా సలహాదారు పేరుతోనే ఖాతాలు తెరిచి టీటీడీ పై దుష్ప్రచారం చేయడాన్ని సహించేది లేదని అన్నారు. నకిలీ ఖాతాలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని.. త్వరలో సైబర్ క్రైం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.