తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు:వైవీ సుబ్బారెడ్డి

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు:వైవీ సుబ్బారెడ్డి

నూతన సంవత్సరం జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మంతో కలిసి ఛైర్మన్ తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లు, పిఎసి-4 తదితర ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను  పరిశీలించారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై పలువురు భక్తులతో ఛైర్మన్ ముచ్చటించగా వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

 నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు  వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. భక్తులు తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా త్వరితగతిన దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల కోసం విఐపిల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేశారు. స్వయంగా వచ్చే విఐపిలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందు వల్ల  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ తో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రధాన కల్యాణ కళ్యాణ కట్ట ఎదురుగా గల పిఎసి-4లో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తామని తెలియజేశారు.