శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు రేపటి (ఫిబ్రవరి 15) నుంచి ఈ టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈనెల 16వ తేదీ దర్శనం కోసం 15న ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ సమాయత్తమైంది. కాగా, రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది.

గతేడాది రోజుకు 2 వేల చొప్పున ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టికెట్లు జారీ చేసినా.. కొవిడ్‌కు తోడు భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వాటిని నిలిపేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే రోజుకు 5 వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు), వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో ప్రతిరోజు 2,530 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ప్రతిరోజు15 వేల టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. దీంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటే అవకాశం ఉంది. 16వ తేదీన శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే వారు..  ఒకరోజు ముందుగానే టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం:

పుల్వామా ఘాతుకానికి ఇవాళ్టితో మూడేళ్లు

భీమ్లా నాయక్ నుంచి కొత్త కబురు

జాతరలో చికెన్, మటన్, మందు అన్నీ పిరమే