
- అమిత్షాను కోరిన తుమ్మల
నిజాబామాద్, వెలుగు : భద్రాచలం పరిసరాల్లోని, ఏపీలో కలిసిన యాటపాక, కన్నాయిగూడం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు ఓ లెటర్ అందజేశారు. భద్రాచలం తెలంగాణలో కొనసాగుతుండగా, నాలుగు పంచాయతీల్లోని 17 రెవెన్యూ గ్రామాలను ఏపీలో కలిపారని, దీని వల్ల పరిపాలన, అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలానికి ఇతర మండలాలకు మధ్య రవాణా సమస్యలు వస్తున్నాయని, ఎల్డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతం కావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు సైతం ఉత్పన్నం అవుతున్నాయన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములు సైతం ఈ గ్రామాల్లో ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం ఆ గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి, ఆఫీస్ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల కృతజ్ఙతలు తెలిపారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. రైతుల వద్దే పసుపు పాలిషింగ్, గ్రేడింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని, దీని వల్ల మార్కెట్లో విలువ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పసుపును అంతర్జాతీయంగా మార్కెట్ చేయడానికి కేంద్రం సహకరించాలని, పసుపు రైతులకు స్థానిక భాషల్లో సలహాలు అందించేలా మొబైల్ యాప్లు అభివృద్ధి చేయాలని కోరారు.