రైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు : సీపీఐ ఎంఎల్

రైతుల పోరాటంతోనే పసుపు బోర్డు ఏర్పాటు : సీపీఐ ఎంఎల్
  • సీపీఐఎంఎల్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అన్యాయం 

ఆర్మూర్​, వెలుగు: పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి అమిత్​షా వస్తున్నారని సీపీఐఎంఎల్ ప్రజా పంథా పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం అని, రైతుల పోరాటం తోనే పసుపు బోర్డు వచ్చిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం సీపీఐఎంఎల్​ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి. కిషన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, నిరసనలు చేసి పసుపు బోర్డు కోసం పోరాటాలు జరిగాయని, అక్రమ కేసులు, అరెస్టులు,  జైలు నిర్బంధాలు ఎదుర్కొని నిలబడ్డ నాయకుల పోరాట ఫలితంగానే  పసుపు బోర్డు ఏర్పాటు అయ్యిందని చెప్పారు.  అరెస్టు చేసిన నాయకులను విడుదల చేసి, బీజేపీ ప్రభుత్వం రైతులకు, రైతు నాయకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ కమిటీ నాయకులు మచ్చర్ల రాజన్న, దుర్గాప్రసాద్, అరవింద్, రవి,తదితరులు పాల్గొన్నారు.

రైతు ఐక్య కార్యచరణ కమిటీని విస్మరించడం తగదు: దేగా యాదాగౌడ్​  

పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర కోసం దశాబ్దకాలంగా నిర్విరామంగా పోరాడిన పసుపు ఉద్యమ పోరాట రైతు ఐక్యకార్యాచరణ కమిటీని విస్మరించడం తగదని రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు దేగాం యాదాగౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు.  పోరాటంతోనే పసుపు బోర్డు సాధించుకున్నామనే ఒక తృప్తి మాత్రం రైతు ఐక్య కార్యాచరణ కమిటీకి మిగిలిందన్నారు. పసుపు రైతు ఉద్యమమే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరిని ఓడించింది.  మరొకరిని గెలిపించిందన్నారు. చరిత్రలో నిజామాబాద్ గడ్డపై 178 మంది రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో,  కేంద్రం హామీ ఇచ్చి ప్రభుత్వం రాగానే స్పేసెస్ బోర్డు పెట్టడం జరిగిందని అన్నారు. మళ్ళీ రైతుల తరఫున ఐక్య కార్యాచరణ కమిటీ వ్యతిరేకించడంతో మోదీ ప్రభుత్వం ఆలోచనలో పడి గత్యంతరం లేనిమాట పసిగట్టి పసుపు బోర్డు ప్రకటించడం జరిగిందని అన్నారు.

నవీపేట్, వెలుగు: పసుపు బోర్డు ప్రారంభం సందర్భంగా వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు.  నిజామాబాద్ 5వ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మాజీ సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, టీయూసీఐ నాయకులు సుధాకర్, మల్లేశ్, గణేశ్, కమల్ బాయ్ లను అరెస్ట్ చేసి నవీపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టులను మండల కేంద్రానికి చెందిన సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, సీపీఐఎంల్ నాయకులు రాజేశ్వర్ తీవ్రంగా ఖండించారు.