- సంక్షోభం వలన మారిన ప్రొఫెషనల్స్ ఆలోచనలు
- స్కిల్స్ పెంచుకునేందుకు ఎక్కువ ప్రయారిటీ
- అమెజాన్ ఇండియా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వలన ప్రొఫెషనల్ ఉద్యోగుల ఆలోచనల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త కెరీర్ను ఎంచుకోవాలని, ఉన్న స్కిల్స్ను మరింత పెంచుకోవాలని అనుకుంటున్నారు. అమెజాన్ ఇండియా చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. దేశంలోని ప్రొఫెషనల్స్ తమ జాబ్ గురించి, ఫ్యూచర్ కెరీర్ ప్లాన్స్ గురించి ఏమనుకుంటున్నారు, కరోనా సంక్షోభ ప్రభావం ఎలా ఉందనే అంశాలను తెలుసుకోవడానికి అమెజాన్ ఈ సర్వే చేసింది. ఈ సర్వేను మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించింది. దేశం మొత్తం మీద వెయ్యి మంది ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను ఈ సర్వే కోసం సేకరించారు. ఈ సర్వే ప్రకారం59 శాతం మంది రెస్పాండెంట్లు జాబ్ కోసం వెతుకుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ముగ్గురు రెస్పాండెంట్లలో ఒకరు తమ జీతాల్లో కోత పడడానికి ప్రధాన కారణం కరోనానే అని పేర్కొన్నారు. కరోనా వలన ఇండస్ట్రీ మార్చుకోవాలని చూస్తున్నామని 68 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు.
ఇప్పుడున్న స్కిల్స్ ఐదేళ్లలో పనికిరావు..
ఇండియన్ ప్రొఫెషనల్స్లో 75 శాతం మంది తమ ప్రస్తుత స్కిల్స్ ఇంకో ఐదేళ్లలో పనికి రాకుండాపోతాయని భావిస్తున్నారు. 90 శాతం మంది కొత్త స్కిల్స్ను నేర్చుకోవడానికి ఆసక్తి చూపించగా, ఈ ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం కరోనా అని 74 శాతం పేర్కొన్నారు. ‘జాబ్ కోసం వెతుకుతున్న వారి ఆసక్తులు, ఆలోచనలు, ఆందోళనలను ముఖ్యంగా కరోనా సంక్షోభం ప్రభావాన్ని ఈ స్టడీ ప్రకటించింది. మారుతున్న జాబ్ మార్కెట్లో కొనసాగడానికి ప్రొఫెషనల్స్ తమ ఇండస్ట్రీని, స్కిల్స్ను పెంచుకుంటున్నారు’ అని అమెజాన్ ఇండియా ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. స్కిల్స్ పరంగా చూస్తే, కెరీర్లో ఎదగాలంటే టెక్నికల్, డిజిటల్ స్కిల్స్ అవసరమని 45 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. 38 శాతం మంది మాత్రం మార్కెటింగ్ స్కిల్స్ చాలా అవసరం అన్నారు. కంపెనీలు ఆఫర్ చేస్తున్న అదనపు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వలన లాభపడ్డామని 76 శాతం మంది చెప్పగా, ఇందులో 97 శాతం మంది ఈ ట్రైనింగ్ స్కీమ్స్ను వాడుకున్నామని పేర్కొన్నారు. అమెజాన్ 2025 నాటికి దేశంలో 20 లక్షల డైరెక్ట్, ఇండైరెక్ట్ జాబ్స్ను క్రియేట్ చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా 8 వేల డైరెక్ట్ జాబ్ ఓపెనింగ్స్ను 35 సిటీలలో స్టార్ట్ చేసింది.
కొత్త ఇండస్ట్రీలలోకి..
సర్వేలో పాల్గొన్న ప్రతీ ముగ్గురిలో ఒకరు (33 శాతం మంది) కొత్త జాబ్కు మారాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు పనిచేయని ఇండస్ట్రీకి షిఫ్ట్ కావాలని 51 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారని ఈ అమెజాన్ ఇండియా వెల్లడించింది. ఎంత పరిహారం ఇస్తారో అనే అంశాన్ని జాబ్కు అప్లయ్ చేసే ముందు పరిగణనలోకి తీసుకుంటామని 55 శాతం మంది చెప్పారు. కరోనా వలన జాబ్ సెక్యూరిటీపై ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. 56 శాతం మంది రెస్పాండెంట్లు జాబ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ‘సుమారు సగం మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ (49 శాతం మంది) కొత్త జాబ్లకు షిఫ్ట్ అయ్యేటప్పుడు మరింత వర్క్ నేర్చుకోవడానికి వీలుంటుందా? లేదా? అనే అంశాన్ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 47 శాతం మంది సేఫ్ ఎన్విరాన్మెంట్కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని అన్నారు.