మస్క్​ సొంతమైన ట్విటర్​..ఈ ఏడాది చివరిలోపు డీల్​ పూర్తి

మస్క్​ సొంతమైన ట్విటర్​..ఈ ఏడాది చివరిలోపు డీల్​ పూర్తి
  •     ఆఫర్​ను అంగీకరించిన ట్విటర్​ బోర్డు
  •     ఈ ఏడాది చివరిలోపు డీల్​ పూర్తి
  •     బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటున్న మస్క్​

వెలుగు బిజినెస్​ డెస్క్​: ట్విటర్​ ఎలాన్​ మస్క్​ వశమైంది. బోర్డు మీటింగ్​లో అందరూ మస్క్​ ఆఫర్​ను అంగీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్విటర్​ వెల్లడించింది. దీంతో, అనుకున్నది నెరవేర్చుకున్నాడు ఎలాన్​ మస్క్​....ట్విటర్​ కొంటానన్నాడు.....చేజిక్కించుకుని ప్రైవేటు కంపెనీగా మార్చాలనే తన ప్లాన్​ను అమలు చేయడంలో మొదటి అడుగు సక్సెస్​ఫుల్​గా వేశాడు. 44 బిలియన్​ డాలర్లకు ట్విటర్​ను మస్క్​కు అప్పచెప్పడానికి అంగీకారం కుదిరింది. అంటే ఒక్కో షేర్​కు 54.20 డాలర్లు. మస్క్​ ఆఫర్​ ప్రకటనకు ముందు రోజు అంటే ఏప్రిల్​1  నాటి ట్విటర్​ షేర్​ రేటుతో  పోలిస్తే ఆయనిస్తున్న ఆఫర్​ 38 శాతం ఎక్కువ. మస్క్​ ప్రకటనతో ట్విటర్​ షేరు పరుగులు పెట్టింది.   స్వేచ్ఛగా అభిప్రాయాల ప్రకటను తావిచ్చేలా ట్విటర్​ను నడుపుతానని ఇప్పటికే ఎలాన్​ మస్క్​ వెల్లడించిన విషయం తెలిసిందే.

డీల్​కు ఏకగ్రీవ ఆమోదం.....

ఎలాన్​ మస్క్​ డీల్​కు ట్విటర్​ బోర్డు సోమవారం  ఆమోదం ప్రకటించింది. ఈ ఏడాది చివరలోపు డీల్​ పూర్తవుతుంది. ట్విటర్​ డీల్​ కోసం బ్యాంకుల నుంచి 25.5 బిలియన్​ డాలర్లను అప్పుగా తీసుకుంటున్నట్లు మస్క్​ చెప్పారు. మిగిలిన డబ్బు  ఆయన ఎలా తెచ్చుకునేదీ ఇంకా స్పష్టం కాలేదు.

మస్క్​కు మస్తు ఫాలోవర్లు..

ట్విటర్​ ప్లాట్​ఫామ్​ను ఎలాన్​ మస్క్​ఎక్కువగానే వాడతారు. ఆయనకు ఈ ప్లాట్​ఫామ్​పై 8.3 కోట్ల మంది పాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలోనే ట్విటర్​లో 9 శాతం వాటాలను మస్క్​ కొన్నారు. మార్చి నాటికి ట్విటర్​పై తీవ్రమైన విమర్శలను గుప్పించడం పెంచారు. కంపెనీ అల్గారిథమ్స్​ సరిగా లేవని, కొన్ని పోస్టులనే ప్రమోట్​ చేస్తున్నాయని, జంక్​పోస్టులతో నిండిపోతోందని....ఇలా కార్యకలాపాలపై విమర్శలు సంధించారు.   

బోర్డులో సీటొద్దన్నారు..

ట్విటర్​ బోర్డులో చేరాల్సిందిగా ఎలాన్​ మస్క్​ను ఏప్రిల్​ 14 న ఆహ్వానించారు. కానీ, ఆయన దానిని తిరస్కరించారు.  సంస్థను కొనడానికే ఇష్టపడతానని ప్రకటించారు. తాను ఇచ్చేదే ఫైనల్​ ఆఫర్​గా పేర్కొన్నారు.  ఫ్రెండ్స్​, తెలుసున్న వాళ్లతో స్టేటస్​ అప్​డేట్స్​ పెంచుకోవడానికి వచ్చిన ట్విటర్​ ప్లాట్​ఫామ్​ ఆ తర్వాత రోజుల్లో చిన్నపాటి పోస్టులను బ్రాడ్​కాస్ట్​ చేసుకోవడానికి మంచి వేదికగా మారిపోయింది.  పొలిటీషియన్లు, సెలిబ్రిటీలు, జర్నలిస్టులు ఈ మైక్రోబ్లాగింగ్​ను వాడటానికి ఇష్టపడటంతో బాగా పాపులర్​ అయింది.