
ఇస్లామాబాద్: కాశ్మీర్ అంశాలను ప్రస్తావించిన 200 ట్విటర్ అకౌంట్లను కావాలనే బ్లాక్ చేశారన్న పాకిస్తాన్ ఆరోపణలను ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విటర్ ఖండించింది. న్యాయబద్దంగా, నిష్పక్షపాతంగానే వ్యవహరించి అకౌంట్లను బ్లాక్ చేశామని చెప్పింది. ఈ అంశంలో ఎటువంటి రాజకీయాలు చేయలేదని ట్విటర్ అధికార ప్రతినిధి చెప్పారు. “ ప్రతి ఒకరికి మాట్లాడే ప్రాథమిక హక్కు ఉంటుందని మేం నమ్ముతాం. హద్దులు దాటి టెర్రరిజం, ద్వేష పూరిత మాటలు, ఒకరిని తక్కువగా చూపిస్తూ చేసే కామెంట్లు మా పాలసీలకు విరుద్దం. ట్విటర్లో ఎవరూ రూల్స్కు అతీతులు కారు” అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టిన దాదాపు 200 పాకిస్తానీ అకౌంట్లను ట్విటర్ బ్లాక్ చేసింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ట్విటర్కు కంప్లైంట్ చేసింది.