ట్విట్టర్ కిల్లర్గా పేరుగాంచిన టకాహిరో షిరైషీకి మరణశిక్ష విధిస్తూ టోక్యో జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. జపాన్కు చెందిన టకాహిరో షిరైషీ అనే 30 ఏళ్ల యువకుడు 9 మందిని క్రూరంగా చంపి.. వారి శరీరాలను ముక్కలుముక్కలుగా చేసి కూలర్లు, టూల్ బాక్సులలో భద్రపరచాడు. ఎవరైనా డిప్రెషన్లో ఉండి.. బాధాకరమైన సందేశాలను ఎవరైతే తమ ట్విట్టర్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ పోస్టు చేస్తారో.. వారే షిరైషీ టార్గెట్. ట్విట్టర్ ద్వారా అందరినీ ఆకర్షించి.. ఇంటికి రప్పించి చంపాడు కాబట్టి అతనికి ట్విట్టర్ కిల్లర్ అనే పేరు వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకువాళ్లు తన ఇంటికి వస్తే.. తాను కూడా మీతో చనిపోతానని చెప్పి వారిని నమ్మించేవాడు. అలా అతని ఇంటికి వచ్చిన మహిళలను అత్యాచారం చేసి చంపి.. ముక్కలు చేసేవాడు. ఇలా 2017 ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్య షిరైషీ ఎనిమది మంది మహిళలను, ఒక పురుషుడిని చంపాడు. మహిళలందరూ 15 నుంచి 26 సంవత్సరాల వయసు గలవారే కావడం గమనార్హం. కాగా వీరిలో ఒక యువతిని కాపాడబోయిన ఆమె ప్రియుడిని కూడా షిరైషీ హత్యచేశాడు. ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు జామా సిటీలోని షిరైషీ అపార్ట్మెంట్లో సోదాలు చేయగా.. ముక్కలు ముక్కలు చేసిన శరీర భాగాలు, 9 తలలు పోలీసుల కంటపడ్డాయి. దాంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. కేసు కోర్టులో హియరింగ్కు వచ్చినప్పడు.. తనకు ఉరిశిక్ష వేసినా తాను పైకోర్టుకు వెళ్లనని షిరైషీ తేల్చి చెప్పాడు. అయితే ఆయన తరపు న్యాయవాదులు మాత్రం.. చనిపోయిన వారి సమ్మతితోనే తమ క్లైంట్ వారిని చంపాడని కోర్టుకు తెలిపారు. కానీ జడ్జీ మాత్రం న్యాయవాదుల వాదనతో ఏకీభవించలేదు. చనిపోయిన వారు బలవంతంగా చంపబడ్డారని ఆయన అన్నారు.
For More News..