మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో రెండు కోట్ల నగదు సీజ్

మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో రెండు కోట్ల నగదు సీజ్

మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో  రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్రలో నివాసం ఉంటున్నారు.   ఉదయం నుంచి త్రిశూల్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు. 

తెల్లవారుజాము నుంచే 50 టీములుగా విడిపోయిన ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు. మంత్రి  మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిలతో సహా వారి బంధువుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. 

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మైసమ్మగూడ, మేడ్చల్ లో వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. మహేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. 

మరోవైపు మంత్రి మల్లారెడ్డి చిన్నకొడుకు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి సంస్థలు, ఆదాయాలు, లెక్కలు, పన్ను చెల్లింపులపై ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి ఇంట్లో బీరువాలు, లాకర్లు ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. అందులో బట్టలు, ఇతర సామాగ్రి మాత్రమే ఉందని బీరువా ఓపెన్ చేసిన వ్యక్తి చెప్పినట్లు తెలిసింది. బీరువా కీ లేదని చెప్పడంతో అక్బర్ అనే వ్యక్తిని ఓపెన్ చేసేందుకు పిలిపించినట్లు చెబుతున్నారు.