కొత్తగూడ/భీమదేవరపల్లి, వెలుగు: అప్పుల బాధతో రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా ముస్తాఫాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మంక్త్యా నాయక్ తండాకు చెందిన బానోత్ గోపాల్(53) తనకున్న రెండెకరాల పొలంలో వరితో పాటు బొబ్బర్లు వేశాడు. రెండేండ్లుగా పంట దిగుబడి సరిగా రాక తీవ్రంగా నష్టపోయాడు. దీంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు దాదాపు రూ.4.50 లక్షలకు పెరిగిపోయాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక, మనస్తాపంతో సోమవారం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు గోపాల్ను వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందతూ మంగళవారం మృతి చెందాడు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామానికి చెందిన రైతు బోడ బీదర్(55) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బీదర్కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉండగా, ఇటీవల కూతుళ్ల పెళ్లి చేశాడు. అదే సమయంలో కొన్నేండ్లుగా పంట దిగుబడి సరిగా రావడం లేదు. దీంతో పంట పెట్టుబడి కోసం, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం తెచ్చిన అప్పులు రూ.5 లక్షల వరకు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక మార్చి 11వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ బీదర్ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.